తమదేశ వైమానిక దాడుల్లో టాప్ ఇరానియన్ కమాండర్ జనరల్ ఖాసిం సోలిమని మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ‘ ఉగ్రవాద శకం ‘ అంతమైంది అని ఆయన వ్యాఖ్యానించారు. సోలిమని టెర్రరిస్టు కుట్రలు ఢిల్లీ, లండన్ కు కూడా వ్యాపించాయని పేర్కొన్నారు. (2012లో ఇండియాలోని ఇజ్రాయెలీ రాయబారి భార్య ప్రయాణిస్తున్న కారుపై జరిగిన బాంబు దాడిలో ఆమెతో బాటు అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆనాడే అమెరికా ఆరోపించింది). ఈ సంఘటనను ట్రంప్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఈ వ్యాఖ్య చేశారు. ఇరాన్ ‘ అల్-కుడ్స్ ‘ ఫోర్స్ అధినేత, ఆ దేశ ప్రాంతీయ భద్రతా వ్యవహారాల ప్రధాన అధికారి కూడా అయిన జనరల్ సోలిమని శుక్రవారం బాగ్దాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన అమెరికన్ వైమానిక దాడిలో మరణించారు.
ఈ ఎటాక్ లో ఇరాక్ లోని శక్తిమంతమైన హషెద్ అల్-షాబీ పారామిలిటరీ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ కూడా హతమయ్యాడు. ఫ్లోరిడాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాక్ లో ఇటీవల తమ దేశ స్థావరాలపై వరుసగా జరిగిన దాడుల్లో ఓ అమెరికన్ మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, అలాగే ఆ దేశంలోని తమ దేశ ఎంబసీని కూడా ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు ముట్టడించి పెను విధ్వంసం సృష్టించారని అన్నారు. వీటి వెనుక సోలిమని హస్తం ఉందన్నారు. ‘ అతని ఉగ్రవాద కుట్రలు ఢిల్లీ, లండన్ కు కూడా వ్యాపించాయి. అనేకమంది అమాయకులను సోలిమని పొట్టన బెట్టుకున్నాడు. ఇక అతని ఉగ్రవాద శకం ముగిసినట్టే.. ‘ అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను అస్థిర పరచేందుకు సోలిమని గత ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడని, ఈ మధ్యే ఇరాన్ లో నిరసన తెలిపిన వెయ్యిమంది అమాయకుల టార్చర్, వధ కూడా సోలిమని ప్లాన్ లో భాగమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.