
కరోనా ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. అంతలా ప్రపంచాన్న కుదిపేసింది ఈ మహమ్మారి. ఎంతోమంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఈ వైరస్ చైనాలోని వూహాన్లో పుట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కరోనా గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున ఓ అంతర్జాతీయ బృందం వూహాన్కు బయలుదేరనుంది. జనవరిలో ఈ బృందం పర్యటిస్తుంది.
మొదటగా అనుమతులు నిరాకరించిన చైనా చివరకు డబ్ల్యూహెచ్వో నేతృత్వంలో జరిగే దర్యాప్తునకు అంగీకరించింది. ఈ సందర్భంగా వూహాన్ దేశపౌరులు స్పందించారు. అంతర్జాతీయ బృందం దర్యాప్తునకు తాము బయపడటం లేదని దీనివల్ల ఇక్కడ వైరస్ పుట్టలేదనే నిజం ప్రపంచానికి తెలుస్తుందని అంటున్నారు. ఒకవేళ వైరస్ ఇక్కడే పుట్టిందని అనుకున్నా అది ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. అందువల్ల డబ్ల్యూహెచ్వో బృందాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కరోనా వైరస్ వూహాన్లోని ఓ సముద్రపు ఆహార మార్కెట్లో బయటపడ్డట్లు ఇప్పటివరకు అందరు భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రపంచానికి పాకి అందరిని అల్లకల్లోలం చేసింది. కరోనా వైరస్ బయటపడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు దానిపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రపంచ బృందం పర్యటిస్తుందని తెలుసుకున్న చైనా ముందుగానే వైరస్ ప్రబలిన మార్కెట్లను మూసివేసింది. దాదాపు 76 రోజుల కఠిన లాక్డౌన్ అమలుచేసి వైరస్ను నియంత్రించింది. మరోవైపు తమ దర్యాప్తు బృందం వుహాన్లో పర్యటిస్తుందా లేదా అన్న విషయాన్ని డబ్ల్యూహెచ్వో అధికారికంగా వెల్లడించలేదు.