చైనా హ్యూమనాయిడ్ రోబోలపై అమెరికా నిషేధం.. మరింత ముదురుతున్న యవ్వారం
జాతీయ భద్రత, సైబర్ భద్రత దృష్ట్యా చైనాలో తయారైన కొత్త హ్యూమనాయిడ్ రోబోట్లు, క్వాడ్రుపెడ్ రోబోట్లు, కనెక్టెడ్ పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. చైనా టెక్నాలజీ ద్వారా డేటా భద్రతకు ముప్పు ఉండొచ్చనే ఆందోళనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న సాంకేతిక పోటీని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా-చైనా మధ్య పోటీ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో తయారైన కొత్త హ్యూమనాయిడ్ (మనిషి ఆకారంలో ఉండే) రోబోట్లు, క్వాడ్రుపెడ్ (నాలుగు కాళ్ల) రోబోట్లు, అలాగే కనెక్టెడ్ పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. జాతీయ భద్రత, సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.
అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ప్రకటించిన ఈ నిబంధనలు ప్రధానంగా చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నవిగా భావిస్తున్నారు. ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ మార్కెట్లో చైనా సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న పరికరాలపై ఈ నిషేధం వర్తించదని, కొత్తగా మార్కెట్లోకి వచ్చే మోడళ్ల దిగుమతులకే ఇది వర్తిస్తుందని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
అమెరికా అధికారులు చైనా తయారీ రోబోట్లు డేటా సేకరణ, గూఢచర్యం, సైబర్ దాడులకు ఉపయోగపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా AI, రోబోటిక్స్, విద్యుత్ మౌలిక సదుపాయాల సరఫరా గొలుసును విదేశీ ఆధారపడటం నుంచి తగ్గించి దేశీయ తయారీని ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు. మరోవైపు అమెరికా నిర్ణయాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. చైనా సంస్థలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ, అవసరమైతే తగిన ప్రతిస్పందన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే అమెరికా–చైనా సాంకేతిక పోటీ మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
