US attack on Syria: సిరియాపై అమెరికా బాంబుల మోత.. ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు

|

Oct 13, 2024 | 7:58 AM

ఇప్పటికే ఓవైపు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని ఐసీస్ ఉగ్రస్థావ‌రాలను ల‌క్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వ‌ర‌కు ప‌లు ద‌ఫాలుగా సిరియాపై దాడుల‌కు పాల్పడిన‌ట్లు అమెరికా సెంట్రల్ క‌మాండ్ ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది.

US attack on Syria: సిరియాపై అమెరికా బాంబుల మోత.. ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు
Us Attack On Syria
Follow us on

కొన్ని దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు.. పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి జరుగుతున్న ఈ ప్రాంతీయ యుద్ధాలు కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా మారితే.. ప్రపంచంలో శక్తిమంతమైన రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఆ యుద్ధంలో పాల్గొంటే.. అప్పుడు ప్రపంచం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇలాంటి భయాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఓవైపు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని ఐసీస్ ఉగ్రస్థావ‌రాలను ల‌క్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వ‌ర‌కు ప‌లు ద‌ఫాలుగా సిరియాపై దాడుల‌కు పాల్పడిన‌ట్లు అమెరికా సెంట్రల్ క‌మాండ్ ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఈ దాడులకు కారణం ఏంటంటే… అమెరికాతో పాటు దాని మిత్రదేశాల‌పై ఐసీస్ దాడులు చేసేందుకు కుట్ర చేస్తోంద‌ని అమెరికాకు క‌చ్చిత‌మైన స‌మాచారం అందడంతో అమెరికా ముందుగానే ఈ దాడులకు దిగింది.

దాడుల్లో ప్రజలు బలికాకూడదని ఆదేశాలు

అయితే ఈ దాడుల్లో అమెరికా ఒక యుద్ధనీతిని పాటిస్తోంది. సిరియాలో తలదాచుకున్న ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తుంది తప్ప .. సామాన్య ప్రజలు ఈ దాడులకు బలికాకూడదని తమ దళాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో అమెరికా కేవలం ఐసిస్ స్థావరాలపైనే బాంబుల వర్షం కురిపించింది. సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబర్ చివరిలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని ప్రకటన చేసింది. వాళ్లందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థల‌కు చెందిన‌వారేన‌ని తెలిపింది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.

ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నాయని అమెరికా ప్రకటన

అయితే తాజాగా చేసిన దాడుల వల్ల ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నాయని అమెరికా తెలిపింది. ఐసిస్ ను బలహీన పర్చేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నామని తెలిపింది. తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేయడంలో భాగంగానే ఈ దాడులకు పాల్పడిందని సెంట్రల్ కమిటీ వెల్లడించింది. తమ మిత్ర దేశాలు, భాగస్వామ్యుల జోలికి వస్తే ఊరుకోబోమని వార్నింగ్ గట్టిగానే ఇచ్చింది. మొత్తం మీద ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్యఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరొక వైపు అమెరికా సిరియాపై దాడులకు దిగడంతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..