ఇటీవల కాలంలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో భారతీయ యువతి చనిపోయింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య (25) మృతి చెందింది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లికు చెందిన కోటేశ్వరరావు సిఆర్పిఎఫ్ జవాన్గా పనిచేశాడు. యాదగిరిపల్లెలో చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ కూతురు, కొడుకును చదివించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు సౌమ్య చదువులో చురుకుగా ఉండేది. రెండేళ్ల క్రితం అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో సామ్యకు ఎమ్మెస్లో సీటు వచ్చింది. కూతురు చదువు కోసం కోటేశ్వరరావు అప్పులు చేసి అమెరికా పంపించాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన సౌమ్య కన్సల్టెన్సీ ద్వారా జాబ్ సెర్చింగ్ చేస్తోంది. నిన్న కూరగాయల కోసం బయటికి వెళ్లిన సౌమ్యను వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది.
సౌమ్య మృతి వార్తతో యాదగిరి పల్లెలో విషాదం నెలకొంది. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఈనెల 11వ తేదీన 25వ బర్త్ డే ను సౌమ్య జరుపుకుందని తండ్రి కోటేశ్వరావు చెబుతున్నారు. ఈ బర్త్ డే వేడుకల కోసం ఇండియా నుండి బట్టలు పంపానని చెబుతున్నాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తన కూతురు విగతజీవిగా మారిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలను తల్లిదండ్రులు కోరుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..