AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌ని వణికించిన భూకంపం.. రంగంలోకి దిగిన ఆర్మీ.. గత రాత్రి కనిపించిన భయానక దృశ్యాలు..

మంగళవారం రాత్రి 9.07 గంటలకు 5.7 తీవ్రతతో ప్రకంపనలు, రాత్రి 9.56 గంటలకు మరో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. వరుస భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందారు. చాలా మంది ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఆరు బయటే గడిపారు.

నేపాల్‌ని వణికించిన భూకంపం.. రంగంలోకి దిగిన ఆర్మీ.. గత రాత్రి కనిపించిన భయానక దృశ్యాలు..
Earthquake
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2022 | 12:38 PM

Share

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. ఈ భూకంపం వల్ల ఇళ్లు కూలిపోవడంతో దాదాపు ఆరుగురు మృతిచెందినట్టుగా తెలిసింది. ప్రమాదంలో మరో ఐదుగురి వరకు గాయపడినట్టుగా సమాచారం. భూకంప తీవ్రత కారణంగా సుమారు 8 ఇళ్లు కూలిపోయాయి. భూకంప కేంద్రం దోటి జిల్లాలోని ఖప్తాడ్ నేషనల్ పార్క్‌లో కేంద్రీకృతమై ఉంది. అంతకుముందు.. పశ్చిమ నేపాల్ మంగళవారం రాత్రి 9.07 గంటలకు 5.7 తీవ్రతతో ప్రకంపనలు, రాత్రి 9.56 గంటలకు మరో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. వరుస భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందారు. చాలా మంది ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఆరు బయటే గడిపారు.

భూకంపం ధాటికి ఆరుగురు మృతి చెందినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫణీంద్ర పోఖరెల్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని దోటిలోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోఖరెల్ వివరించారు. భూకంపం ధాటికి ఒక పోలీసు పోస్టు, ఎనిమిది ఇళ్లు కూలిపోయాయి. భూకంపం సమయంలో దెబ్బతిన్న ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుని బాధితులందరూ మరణించారని దోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో తాత్కాలిక చీఫ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భోలా భట్టా తెలిపారు.

ఇక, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. నేపాలీ ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ మాట్లాడుతూ, గ్రౌండ్ రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుందని, సమీపంలోని సుర్ఖేత్ మరియు నేపాల్‌గంజ్ పట్టణాల్లో రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నేపాల్‌లోని భూకంప కేంద్రం భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) భూకంపం తీవ్రత 5.6గా ఉందని అంచనా వేసింది.

2015లో సంభవించిన రెండు పెద్ద భూకంపాలు దాదాపు 9,000 మందిని చంపి, మొత్తం పట్టణాలు, శతాబ్దాల నాటి దేవాలయాలను ధ్వంసం చేసింది. ఆర్థిక వ్యవస్థకు $6 బిలియన్ల నష్టం కలిగించిన తర్వాత నేపాల్ ఇప్పటికీ పునర్నిర్మిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి