
Prophet Mohammad row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. దేశంతోపాటు పలు దేశాల్లో ముస్లింలు నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు సైతం నుపుర్ శర్మ, నవీన్ జిందాల్పై చర్యలు తీసుకోవాలంటూ భారత్ను కోరాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రదర్శన నిర్వహించిన ప్రవాస భారతీయులకు కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన వారిని గుర్తించి, వీసాలను రద్దు చేయాలని భావిస్తోంది. వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోందని అక్కడి మీడియా కథనం ప్రచురించింది. నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేసి, సఫర్ జైలు ద్వారా వారి వారి దేశాలకు పంపించాలని కువైట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు కథనంలో పేర్కొంది.
మీడియా కథనం ప్రకారం.. కువైట్లోని ఇతర దేశాల వారు (ప్రవాసులు) అక్కడ ప్రదర్శనలు, నిరసనలు తెలపకూడదు. ఆ దేశంలోని చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారిని ఆ దేశం నుంచి బహిష్కరిస్తారు. నిరసనలో పాల్గొన్న వారిని మళ్లీ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించనున్నట్లు తెలుస్తోంది. కువైట్లోని ప్రవాసులందరూ తప్పనిసరిగా కువైట్ చట్టాలను గౌరవించాలి.. ఎలాంటి ప్రదర్శనలలో పాల్గొనకూడదు అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది
కాగా.. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఫహలీల్ అనే ప్రాంతంలో భారతీయులు ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల శాంతియుతంగా నిరసన తెలిపారు. ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపారు. కాగా.. దీనిపై కువైట్ ప్రభుత్వం సీరియస్ అయింది. నిరసనలో పాల్గొన్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..