మోదీ-ట్రంప్ సమ్మిట్..! వాట్ నెక్స్ట్ ..?
భారత-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయా ? జపాన్ లోని ఒసాకాలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సౌహార్ద వాతావరణంలో జరిగిన చర్చలు అవుననే అనిపిస్తున్నాయి. జీ-20 సమ్మిట్ సందర్భంగా వీరిద్దరూ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇరాన్ అంశంతో సహా 5 జీ కమ్యూనికేషన్ నెట్ వర్క్ తదితర విషయాలపై విస్తృత చర్చలు జరిపారు. ‘ మనం మంచి మిత్రులమయ్యాము.. కానీ మన దేశాలు ఇంకా సన్నిహితం […]

భారత-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయా ? జపాన్ లోని ఒసాకాలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సౌహార్ద వాతావరణంలో జరిగిన చర్చలు అవుననే అనిపిస్తున్నాయి. జీ-20 సమ్మిట్ సందర్భంగా వీరిద్దరూ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇరాన్ అంశంతో సహా 5 జీ కమ్యూనికేషన్ నెట్ వర్క్ తదితర విషయాలపై విస్తృత చర్చలు జరిపారు.
‘ మనం మంచి మిత్రులమయ్యాము.. కానీ మన దేశాలు ఇంకా సన్నిహితం కావలసి ఉంది ‘ అని ట్రంప్ అన్నారు. ముఖ్యంగా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయన నొక్కి చెప్పారు. తమ దేశ ఉత్పత్తులపై ఇండియా అధిక సుంకాలను విధించడం పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది తమకెంత ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసిన ఆయన.. వీటిని వెంటనే ఉపసంహరించాలని కోరారు. ఇండియాకు ఇస్తున్న వాణిజ్య రాయితీలను అమెరికా ఈనెల 1 న రద్దు చేయడంతో ఇందుకు ప్రతీకార చర్యగా అమెరికా సరకులమీద భారత ప్రభుత్వం టారిఫ్ ను పెంచింది. అయితే ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే ఈ పెంచిన సుంకాలు మరీ ఎక్కువేమీ కావని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ ప్రయోజనాలను పక్కనబెట్టి వాణిజ్య సంబంధాల అంశానికి ప్రాధాన్యమిచ్ఛే ప్రసక్తే లేదని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. ఇండియాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోదీ ఘన విజయం సాధించినందుకు ఆయనను ట్రంప్ అభినందించారు. ‘ మీరిందుకు అర్హులు.. ప్రజలందరినీ కలుపుకుని రావడంలో మీరు చేసిన కృషి అపారం.. ‘ అని పేర్కొన్న ఆయన.. మీరు మొదట ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎన్నో చిక్కులనెదుర్కొన్నారని, ఇప్పుడు అన్నీ సమసిపోయాయని అన్నారు. అటు-అమెరికాతో పాజిటివ్ రిలేషన్ షిప్ కోసం తాము నిరంతరం ప్రయత్నిస్తామని మోదీ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికన్ రక్షణ సంస్థలనుంచి మిలిటరీ హార్డ్ వేర్ ని ఇండియా కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా-చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, జపాన్ అధ్యక్షుడు షింజో అబే తదితర నాయకులతో చర్చలు జరిపిన మోదీ.. టెర్రరిజం అదుపునకు అన్ని దేశాలూ గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. 2022 లో జీ-20 సమ్మిట్ ను ఇండియా నిర్వహించనున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
