AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

"ఇంట్లో ధాన్యం గింజలు లేకపోయినా.. ప్రపంచ యుద్ధాలు ఆపడానికి బయలుదేరడం" అనే సామెత ప్రస్తుతం పాకిస్థాన్‌ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతున్న తరుణంలో, ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడటం గమనార్హం.

సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని
Pakistan Pm Shehbaz Sharif
Balaraju Goud
|

Updated on: Apr 30, 2026 | 11:13 AM

Share

“ఇంట్లో ధాన్యం గింజలు లేకపోయినా.. ప్రపంచ యుద్ధాలు ఆపడానికి బయలుదేరడం” అనే సామెత ప్రస్తుతం పాకిస్థాన్‌ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతున్న తరుణంలో, ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడటం గమనార్హం.

బుధవారం (ఏప్రిల్ 29) జరిగిన పాకిస్థాన్ కేబినెట్ సమావేశంలో షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధానికి ముందు వారానికి 300 మిలియన్ డాలర్లుగా ఉన్న చమురు దిగుమతి ఖర్చు, ఇప్పుడు ఏకంగా 800 మిలియన్ డాలర్లకు పెరిగింది. గత రెండేళ్లుగా అతికష్టం మీద సాధించిన ఆర్థిక పురోగతి ఈ ఒక్క యుద్ధం వల్ల నీరుగారిపోయిందని ప్రధాని అంగీకరించారు.

తమ దేశం ఆర్థికంగా చితికిపోతున్నా, ప్రాంతీయ స్థిరత్వం పేరుతో పాకిస్థాన్ శాంతి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు సుమారు 21 గంటల పాటు సాగడం విశేషం. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని, దీని వెనుక పాకిస్థాన్ దౌత్యనీతి ఉందని షరీఫ్ పేర్కొన్నారు.

ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మస్కట్, మాస్కో పర్యటనల అనంతరం పాకిస్థాన్‌కు వచ్చి రెండో విడత చర్చల గురించి చర్చించారు. ఒమన్‌లో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని, త్వరలోనే ఇరాన్ నాయకత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు షరీఫ్ తెలిపారు.

సొంత దేశంలో ద్రవ్యోల్బణం, ఆకలి కేకలు పెరిగిపోతున్నా.. అంతర్జాతీయ వేదికపై తన ప్రాముఖ్యతను నిరూపించుకోవడానికి పాకిస్థాన్ తపిస్తోంది. అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలకు కూడా ఆతిథ్యం ఇవ్వాలని యోచిస్తోంది. అయితే, ఈ దౌత్య విజయాలు పాకిస్థాన్ సామాన్యుడి కడుపు నింపుతాయా? లేక మరింత అప్పుల భారానికి దారితీస్తాయా? అన్నది కాలమే నిర్ణయించాలి. వివాదం ముగిసి చమురు ధరలు తగ్గితే తప్ప పాకిస్థాన్ ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us