AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 రోజుల పాటు చీకటిలోనే.. చివరకు ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు.. నేపాల్‌లో అద్భుతం!

ఊహించని ప్రకృతి విపత్తు.. చుట్టూ ఎటుచూసినా మట్టి, బండరాళ్లు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి.. అయినా ప్రాణాలపై ఆశ వదులుకోలేదు. చివరకు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటంతో నేపాల్‌లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని శుక్రవారం (సెప్టెంబర్ 04) నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.

9 రోజుల పాటు చీకటిలోనే.. చివరకు ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు.. నేపాల్‌లో అద్భుతం!
Nepal Tunnel Rescue
Balaraju Goud
|

Updated on: Sep 04, 2026 | 12:07 PM

Share

ఖాట్మండు: ఊహించని ప్రకృతి విపత్తు.. చుట్టూ ఎటుచూసినా మట్టి, బండరాళ్లు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి.. అయినా ప్రాణాలపై ఆశ వదులుకోలేదు. చివరకు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటంతో నేపాల్‌లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని శుక్రవారం (సెప్టెంబర్ 04) నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.

రక్షించిన వారిని మెకానికల్ ఫోర్‌మ్యాన్ సంజయ్ సాహ్, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్‌గా అధికారులు గుర్తించారు. వీరిద్దరూ సుమారు 170 మీటర్ల లోతులో సొరంగంలో చిక్కుకుపోయినట్లు నేపాల్ ఆర్మీ అధికారులు తెలిపారు. తొలుత సంజయ్ సాహ్‌ను బయటకు తీసుకువచ్చిన రక్షణ బృందం.. ఆ తర్వాత కబీర్ మహర్జన్‌ను కూడా సురక్షితంగా బయటకు తీసింది.

‘మేం ఉన్నాం.. భయపడకండి’..!

ఆగస్టు 26వ తేదీన బోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో భారీ వరదలు, మంచు-రాళ్ల ప్రవాహం సంభవించిన తర్వాత పలువురు కార్మికులు సొరంగాల్లో చిక్కుకుపోయారు. రక్షణ చర్యలు కొనసాగుతున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున సొరంగం లోపలి నుంచి మనుషుల మాటలు వినిపించడం రక్షకుల్లో కొత్త ఆశలు నింపింది.

రక్షణ బృందాలు సొరంగం లోపల ఉన్నవారికి.. “భయపడకండి.. మిమ్మల్ని రక్షించేందుకు మేం వచ్చాం” అని కేకలు వేయగా.. లోపలి నుంచి “సరే” అంటూ సమాధానం వచ్చినట్లు ఎంపీ, ఇంజనీర్ శ్రీరామ్ న్యుపానే వెల్లడించారు. ఒకరి కంటే ఎక్కువ మంది సజీవంగా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో నేపాలీ సైన్యం, సాయుధ పోలీసు బలగాలు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశాయి.

మట్టిలో కూరుకుపోయినా.. ప్రాణాలతో బయటకు!

సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో అక్కడికి చేరుకోవడం రక్షణ బృందాలకు అత్యంత సవాలుగా మారింది. ప్రత్యేక పరికరాలు, భారీ యంత్రాలను ఉపయోగిస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. చివరకు సొరంగంలోని చిక్కుముడిని ఛేదించి ఇద్దరినీ బయటకు తీసుకువచ్చారు. రక్షించిన ఇద్దరినీ వైద్య పరీక్షల కోసం తరలించారు. సంజయ్ సాహ్‌కు స్వల్ప గాయాలు కాగా, కబీర్ మహర్జన్ చేతులు, కాళ్లు కదలించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స కోసం ఖట్మండుకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇంకా పలువురు చిక్కుకున్నారా?

ఇద్దరు సజీవంగా బయటపడటంతో రక్షణ బృందాల్లో ఆశలు మరింత పెరిగాయి. త్రిశూలి-3A సొరంగంలో ఇంకా పలువురు కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం నేపాల్‌లోని పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు, వారిలో వందలాది మంది సొరంగాల్లో చిక్కుకుని ఉండొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు.

నేపాల్‌ను కుదిపేసిన ప్రకృతి విపత్తు

ఆగస్టు 26వ తేదీన నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో హిమనదం కూలిపోవడం, దాని ప్రభావంతో మంచు, రాళ్లు, మట్టి భారీగా కిందికి రావడం వల్ల త్రిశూలి నదీ లోయలో తీవ్ర వరదలు సంభవించాయి. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా నివేదికల ప్రకారం ఈ విపత్తులో నేపాల్‌లో మృతుల సంఖ్య 1,280 దాటింది, వేలాది మంది గల్లంతయ్యారు.

ఇలాంటి ఘోర విపత్తు మధ్య.. తొమ్మిది రోజుల పాటు సొరంగంలో చిక్కుకుని ఇద్దరు ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతమే. ఇప్పుడు రక్షణ బృందాల దృష్టి సొరంగాల్లో ఇంకా ఎవరైనా సజీవంగా ఉన్నారా అనే దానిపైనే ఉంది. ఒక్కొక్క ప్రాణాన్ని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us