AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూకంపాలతో చిగురుటాకులా వణికిన వెనిజులా.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు దేశాన్ని తీవ్రంగా వణికించాయి. అనంతరం నమోదైన 20కిపైగా ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక భవనాలు కూలిపోగా, భారీ ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది.

భూకంపాలతో చిగురుటాకులా వణికిన వెనిజులా.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
Venezuela Earthquake
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2026 | 9:39 AM

Share

వెనిజులాలో బుధవారం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు దేశాన్ని తీవ్రంగా వణికించాయి. భూకంపాల తర్వాత 20కిపైగా ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక భవనాలు కూలిపోగా, భారీ ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

నిమిషం వ్యవధిలో రెండు భారీ భూకంపాలు

అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం రాజధాని కారకాస్‌కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత నిమిషం లోపే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం నమోదైంది.

కూలిన భవనాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

భూకంపాల ప్రభావంతో అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారి సంఖ్య, మృతుల సంఖ్యపై ప్రభుత్వం ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

విమానాశ్రయం మూసివేత.. పాఠశాలలకు సెలవులు

భూకంపాల కారణంగా మైక్వెటియాలోని సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నష్టం వాటిల్లింది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరమ్మతుల పనులు పూర్తయ్యే వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

భారీ ప్రాణనష్టం ఉండొచ్చన్న అంచనా

అమెరికా భూగర్భ సర్వే సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భూకంపాల వల్ల భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 10 వేల నుంచి లక్ష మంది మధ్య మృతులు ఉన్నట్లు సమాచారం.  పరిస్థితిని అంచనా వేయడానికి అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మరోవైపు వరుస ప్రకంపనలు కొనసాగుతుండటంతో దెబ్బతిన్న భవనాలు మరింత కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వెనెజులా ప్రజలకు మాజీ అధ్యక్షుడు మదురో సంఘీభావం తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌ జైలు నుంచి వెనెజులా ప్రజలకు సందేశం పంపారు. అందరూ ఐక్యంగా, సంఘీభావంతో ఉండాలని.. సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని మదురో పిలుపునిచ్చారు.

Follow Us