Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొజాంబిక్‌లో నరమేధం.. 50 మంది తలలు నరికిన ఉగ్రవాదులు..!

మొజాంబిక్‌ దేశంలో అతి దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దారుణాల్లో మరొక కిరాతకం వెలుగులోకి వచ్చింది.

మొజాంబిక్‌లో నరమేధం.. 50 మంది తలలు నరికిన ఉగ్రవాదులు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 10, 2020 | 9:40 PM

మొజాంబిక్‌ దేశంలో అతి దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దారుణాల్లో మరొక కిరాతకం వెలుగులోకి వచ్చింది. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో అత్యంత పాశవికంగా నరమేధం సాగించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఈ నరమేధం జరిగిందని వెల్లడించింది. దాదాపు 50 మంది గ్రామస్తుల తలలు తెగనరకడంతోపాటు, మహిళలను అపహరించారని తెలిపింది.

నంజబ అనే గ్రామంలోకి శుక్రవారం రాత్రి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేసే ఉగ్రవాదులు ప్రవేశించారు. ఇద్దరి తలలు తెగనరికి, వారి శరీరాలను కూడా ఛిద్రం చేసినట్లు స్థానికులు తెలిపారని మీడియా పేర్కొంది. ఉగ్రవాదులు ‘అల్లాహు అక్బర్’ అంటూ అరుచుకుంటూ, కాల్పులు జరుపుతూ గ్రామాల్లో ప్రవేశించినట్లు స్థానికులు వెల్లడించారని అక్కడి మీడియా ప్రచురించింది. ప్రజలను చంపడంతో పాటు ఇళ్లను కూడా తగులబెట్టారని పేర్కొంది. మౌటాడి అనే గ్రామంపైకి మరికొందరు ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపింది. అక్కడి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి 50 మందికిపైగా సామాన్య ప్రజలను లాక్కెళ్లి, వారి తలలను తెగనరికి, వారి శరీరాలను కూడా ముక్కలుగా చేసి చిందర వందర చేసినట్లు తెలిపింది. ఉగ్రవాదులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రజలను నిర్బంధించి, తెగ నరికినట్లు మీడియా పేర్కొంది. 2017 నుంచి ఇటువంటి దాడులు తరుచూ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 2,000 మందికి పైగా సామాన్య ప్రజానీకం ప్రాణాలను కోల్పోయారని, దాదాపు 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది.

అయితే, గత కొన్నేళ్లు ఈ ప్రాంతంలో ప్రత్యేక పాలన సాగించేందుకు ఉగ్రవాదసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్థానికులు పేదరికం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుండటంతో, ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని, వారిని ఉగ్రవాదంలోకి చేర్చేందుకు ఇస్లామిక్ స్టేట్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.