జూలై 9న అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు! పూర్తి షెడ్యూల్ ఇదే
ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల పూర్తి షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించినట్లు చెబుతున్నారు. ఐదు రోజులపాటు వివిధ నగరాల్లో కార్యక్రమాలు జరిగి, చివరిగా జూలై 9న మషద్లోని ఇమామ్ రెజా మందిరం వద్ద ఖననం చేస్తారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీకి సంబంధించిన ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియల పూర్తి షెడ్యూల్ను ఇరాన్ అధికారులు ప్రకటించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించినట్లు పేర్కొంటూ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆయన అంత్యక్రియలు ఐదు రోజులపాటు వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. చివరిగా జూలై 9న పవిత్ర నగరం మషద్లో ఖననం చేయనున్నట్లు వెల్లడించారు. ఇమామ్ ఆరోహణ స్మారక కమిటీ(ది కమిటీ ఫర్ ది కామెమొరటైన్ అఫ్ ది అసెన్షన్ అఫ్ ది ముజాహిద్ మార్టిర్ ఇమాం) జూన్ 13న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 4, 5 తేదీలలో టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం జూలై 6న టెహ్రాన్ నగరంలో భారీ అంత్యక్రియల ఊరేగింపు జరగనుంది. జూలై 7న పవిత్ర నగరమైన ఖోమ్లో మరో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇమామ్ సజ్జాద్ అమరత్వ దినానికి ముందు రోజు అయిన జూలై 9న మషద్లో తుది అంత్యక్రియలు జరుగుతాయి. ఈ కార్యక్రమం ఇమామ్ రెజా మందిరం వద్ద ఖననంతో ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఖమేనీతో పాటు మరణించిన ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ మిస్బా అల్-హుదా బఖేరీ కనీ, సయ్యిదా బుష్రా హోస్సేనీ ఖమేనీ, జహ్రా హద్దాద్ అడెల్, జహ్రా మొహమ్మది గోల్పాయెగానిలను కూడా అదే వేడుకల్లో ఖననం చేయనున్నట్లు ప్రకటించారు. 1989లో ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతొల్లా రుహొల్లా ఖొమేనీ మరణం అనంతరం సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన అలీ ఖమేనీ దాదాపు 35 ఏళ్లపాటు దేశానికి నాయకత్వం వహించారు. ఆయన మరణానంతరం మార్చి 4న అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత నిర్ణయించినప్పటికీ, ప్రాంతీయ ఘర్షణలు మరియు భద్రతా పరిస్థితుల కారణంగా కార్యక్రమాన్ని పలుమార్లు వాయిదా వేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
