PM Modi: యూఎస్లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు: మోదీ
PM Modi: భారతీయులను స్వదేశానికి పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా.. 2019లో గరిష్ఠంగా 2042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది..

అమెరికాలో మరో రెండు నగరాల్లో భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రాయబార కేంద్రాలు లాస్ ఏంజిల్స్, బోస్టన్ నగరాల్లో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇది అంతర్జాతీయ సమస్య
ఈ సందర్భంగా అక్రమ వలసలపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అంతర్జాతీయ సమస్య అని, అక్రమ వలసదారులకు దేశంలో ఉండే హక్కు లేదన్న మోదీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, అక్రమ వలసదారులను భారతదేశానికి పంపించే కార్యక్రమం అమెరికా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు విమానాలు భారత్కు రానున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక విమానంలో మరి కొంత మందిని తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం. అక్రమ వలసదారులను పంపించే కార్యక్రమంలో భాగంగా అమెరికా చేపడుతోన్న డిపోర్టేషన్ ప్రక్రియలో 104 మంది భారతీయులను ఈనెల 5న భారత్కు తీసుకువచ్చారు. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని వెల్లడించింది.
ఇది కొత్తేమి కాదు..
అయితే భారతీయులను స్వదేశానికి పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా.. 2019లో గరిష్ఠంగా 2042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి