టీకా లేని కొత్త వేరియంట్.. వణికిస్తున్న ఎబోలా.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO!
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాలలో ఎబోలా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అక్కడ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ రెండు దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందుతున్న వేగం, దాని తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని WHO అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ హెచ్చరించారు.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాలలో ఎబోలా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అక్కడ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ రెండు దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందుతున్న వేగం, దాని తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని WHO అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ హెచ్చరించారు. జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాప్తి కారణంగా ఇప్పటికే 130 కి పైగా మరణాలు సంభవించాయని, 500 కి పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.
గతంలో ఎబోలా కేసులు కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కంపా, గోమా, బుర్కినా వంటి జనసాంద్రత కలిగిన ప్రధాన నగరాల్లో కూడా ఎబోలా కేసులు వేగంగా నమోదవుతున్నాయి. నగరాల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందితే దానిని అదుపు చేయడం అత్యంత సంక్లిష్టంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో తీవ్రమైన విషయం ఏమిటంటే, రోగులకు సేవలందిస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది వైద్యులు, నర్సులు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆసుపత్రులలోనే వైరస్ సంక్రమణ జరుగుతోందని సూచిస్తోంది. దీనికి తోడు, మే నెలలో తొలి కేసు నమోదైన ఇటూరి ప్రాంతం నుండి భయంతో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ సామూహిక వలసల వల్ల వైరస్ కొత్త ప్రాంతాలకు సులభంగా విస్తరించే ప్రమాదం ఏర్పడింది.
ప్రస్తుత వ్యాప్తికి ‘బండిబుగ్యో’ (Bundibugyo) అనే ఎబోలా వైరస్ రకం కారణమని WHO గుర్తించింది. దురదృష్టవశాత్తూ, ఈ నిర్దిష్ట రకానికి ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి ఆమోదించిన వ్యాక్సిన్ గానీ, ఖచ్చితమైన చికిత్స గానీ అందుబాటులో లేదు. ఈ కొరత వైరస్ నియంత్రణకు పెద్ద సవాలుగా మారింది. పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా ప్రభుత్వం.. కాంగో, ఉగాండాలకు అత్యవసర విపత్తు సహాయక బృందాలను రంగంలోకి దించింది. అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఈ సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
