AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Havana Syndrome: షాకింగ్.. హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా? అమెరికా ఇంటెలిజన్స్ అధికారికి సిండ్రోమ్ లక్షణాలు

అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్‌కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా ఇంటెలిజన్స్(CIA) అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించారు.

Havana Syndrome: షాకింగ్.. హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా? అమెరికా ఇంటెలిజన్స్ అధికారికి సిండ్రోమ్ లక్షణాలు
Havana Syndrome
Janardhan Veluru
|

Updated on: Sep 21, 2021 | 1:52 PM

Share

అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్‌కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్(CIA) అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించారు. దీంతో హవానా సిండ్రోమ్ పట్ల అమెరికా అధికారులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. సీఐఏ డైరెక్టర్‌కు హవానా సిండ్రోమ్ లక్షణాలపై అమెరికా దర్యాప్తు జరుపుతున్నట్లు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ సోమవారం వెల్లడించాయి. బాధితుడి వివరాలను అమెరికా ఇంకా వెల్లడించలేదు. అయితే అతనికి వైద్య చికిత్స అంది స్తున్నట్లు సీఎన్ఎన్ మీడియా సంస్థ తెలిపింది. అమెరికా దౌత్యవేత్తలు, ఇంటెలిజన్స్ అధికారులు మాత్రమే హవానా సిండ్రోమ్ బారినపడుతుండడం తెలిసిందే. ఈ సిండ్రోమ్ బారినపడితే మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది. కొందరు వినికిడి కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో దాదాపు 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండ్రోమ్ బారినపడినట్లు తెలుస్తోంది. వికారం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో ఈ సిండ్రోమ్ బాధితులు ఇబ్బందిపడుతున్నారు.

2016లో క్యూబా రాజధాని హవానాలో పనిచేస్తున్న అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఈ సిండ్రోమ్‌ను గుర్తించారు. హవానాలో తొలుత గుర్తించినందున దీనికి హవానా సిండ్రోమ్ అని నామకరణం చేశారు. ఈ సిండ్రోమ్ బారిన పడుతున్న బాధితుల్లో ఎక్కువ మంది క్యూబా, చైనా, రష్యా, ఆస్ట్రియా, పోలాండ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారే ఉన్నారు. దౌత్యవేత్తలతో పాటు తమ సైనికులు కూడా భారీ సంఖ్యలో ఈ సిండ్రోమ్ బారినపడే ప్రమాదముందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. గత వారం హవానా సిండ్రోమ్‌‌పై తమ సైనికులను పెంటగాన్ అప్రమత్తం చేసింది. ఒక్కసారిగా మెదడు సమస్యలతో సతమతమవుతున్న సైనికులు వెంటనే తమకు సమాచారమివ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో భారత్‌లో పర్యటించిన ఇంటెలిజన్స్ అధికారిలోనూ ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించడం ఆ దేశ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

హవానా సిండ్రోమ్ ఎందుకు? ఎలా? వస్తుందో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు. హవానా సిండ్రోమ్ బారినపడుతున్న వారికి మెదడు తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్కానింగ్‌లో తేలింది. భారీ ప్రమాదం జరిగితే మెదడు దెబ్బతినే స్థాయిలో.. హవానా సిండ్రోమ్ కారణంగా మెదడు దెబ్బతినడం పట్ల వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా హవానా సిండ్రోమ్ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక దృష్టిసారించారు.

శత్రువులపై అమెరికాకు అనుమానం..

దీని వెనుక శత్రు దేశాల కుట్ర ఏమైనా ఉండొచ్చన్న అమెరికాకు అనుమానం కలుగుతున్నాయి. మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తు తెలియని ప్రత్యర్థులు తమ సిబ్బందిపై దాడులు చేస్తున్నట్లు అమెరికా భావిస్తోంది. అమెరికా అలా సందేహించడానికి బలమైన కారణాలు లేకపోలేదు. ఈ సిండ్రోమ్ బారినపడుతున్న వారిలో ఎక్కువమంది అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనికులు, సీఐఏ సిబ్బంది, విదేశాంగ శాఖ ఉద్యోగులే ఉన్నారు.

Also Read..

రైల్వే టికెట్ల కోసం ఏజెంట్లపై ఆధారపడుతున్నారా?.. ఇకపై ఆ అవసరం లేదు.. ఇలా చేయండి..

చిత్ర పరిశ్రమలో విషాదం.. సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత.. ప్రముఖులు సంతాపం