China Coronavirus: కరోనాను కట్టడి చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది చైనా.. ఎన్ని కఠిన లాక్డౌన్లు అమలు చేస్తున్నా అక్కడి నగరాల్లో మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు.. కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కొత్త ప్రాంతాలకు వైరస్ విజృంభిస్తోంది. చైనా వాణిజ్య రాజధానిగా పేరొందిన షాంఘై విలవిలాడిపోతోంది. దాదాపు రెండు నెలలుగా ఇక్కడ లాక్డౌన్ అమలవుతున్నా కొవిడ్ విజృంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ నగరంలో 5లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. షాంఘైలో రోజుకు సుమారు 50 మంది కరోనా బారిన పడి మరణిస్తున్నారు. షాంఘై నగరంలో వృద్దుల సంఖ్య అధికంగా ఉండడంతో వారిలో సహజంగాను అనారోగ్య సమస్యలు ఉన్నాయని, సలుభంగా కరోనా భారిన పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. మరణాల సంఖ్య ఎక్కువ నమోదు కావడానికి కారణం కూడా ఇదేనంటున్నారు. కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్డౌన్, కర్ఫ్యూలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. ఇళ్లలోంచి బయటకు రానీయకపోవడంతో ఆహారం నిండుకొని జనం ఆకలి కేకలు పెడుతున్నారు. కొన్ని చోట్ల పోలీసుల ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారు.
మరోవైపు చైనా రాజధాని బీజింగ్లో కొత్తగా కరోనా విజృంభన మొదలైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన 35 లక్షల పరీక్షల్లో 21 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో బీజింగ్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 155కి చేరుకుంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్వే ఉన్నాయి. బీజింగ్లో లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపించడంతో జనం నిత్యావసరాల కోసం ఎగబడుతున్నారు.. దీంతో అక్కడి మార్కెట్లు ఖాళీఅయిపోతున్నాయి. అయితే నిత్యావసరాలకు ఎలాంటి కొరతా లేదని అధికారులు చెబుతున్నారు.
Also Read:
సింగపూర్ లో భారత సంతతి వ్యక్తికి ఉరి.. విఫలమైన 11ఏళ్ల పోరాటం
Vivo: వచ్చే నెలలో వివో నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. Vivo T1 ప్రో, Vivo T1 44W పేరుతో విడుదల..