PM Modi: అమెరికా అధ్యక్షుడి స్థాయి ప్రోటోకాల్.. ఇజ్రాయెల్లో ప్రధాని మోదీ క్రేజ్ చూస్తే మైండ్ బ్లాంకే..
ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, విభేదాలు భగ్గుమన్నా.. అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఏకైక శక్తిగా మోదీ మరో చరిత్ర సృష్టించారు. శత్రువులైనా, మిత్రులైనా సలాం కొట్టక తప్పని రీతిలో.. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ సాక్షిగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడి స్థాయి ప్రోటోకాల్తో ఇజ్రాయెల్ మోదీని గౌరవించింది.

అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ముద్ర వేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ సాక్షిగా జరిగిన పరిణామాలు భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న అచంచలమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన రాజకీయాలు ఉన్న పశ్చిమ ఆసియాలో ఇటు ఇజ్రాయెల్.. అటు పాలస్తీనా రెండింటి ఆమోదం పొందిన ఏకైక విశ్వగురువుగా మోదీ అవతరించారు.
తొలి ప్రపంచ నేత
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ అందుకున్న మొట్టమొదటి విదేశీ నాయకుడిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. సాధారణంగా ఏ దేశ పార్లమెంటులోనైనా అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు సహజం. కానీ మోదీ ప్రసంగం సమయంలో ఇజ్రాయెల్ ప్రతిపక్షం ఏకగ్రీవంగా సభలో ఉండి ఆయనకు మద్దతు తెలపడం ఒక అరుదైన గౌరవం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఒక విదేశీ నేత గౌరవార్థం నెస్సెట్ భవనం మొత్తం భారత జాతీయ జెండా రంగులైన కేసరి, తెలుపు, ఆకుపచ్చ కాంతులతో మెరిసిపోయింది. ఇది కేవలం ప్రోటోకాల్ మాత్రమే కాదు.. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధానికి సంకేతం.
అమెరికా అధ్యక్షుడితో సమానమైన గౌరవం
ఇజ్రాయెల్ దౌత్య నిబంధనల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు లేదా పోప్ వచ్చినప్పుడు మాత్రమే ఆ దేశ ప్రధాని స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలుకుతారు. అయితే ప్రధాని మోదీ కోసం బెంజమిన్ నెతన్యాహు ఈ నిబంధనలను పక్కనపెట్టి.. తన భార్య సారా నెతన్యాహుతో కలిసి విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. మోదీ హగ్తో ప్రారంభమైన ఈ పర్యటన, ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత కెమిస్ట్రీని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఇజ్రాయెల్ – పాలస్తీనా పురస్కారాలు
ప్రపంచంలో ఏ ఇతర దేశాధినేతకు సాధ్యం కాని రీతిలో మోదీ రెండు విరుద్ధ ధృవాల నుండి అత్యున్నత పురస్కారాలు పొందారు. 2018లో పాలస్తీనా అత్యున్నత గౌరవం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవం స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ అందుకుని చరిత్ర సృష్టించారు. రెండు శత్రు దేశాల మధ్య సమతూకాన్ని పాటిస్తూ, శాంతిని కాంక్షించే నాయకుడిగా మోదీ తన దౌత్య చతురతను చాటుకున్నారు.
నినదించిన నెస్సెట్..
ప్రధాని తన ప్రసంగాన్ని హీబ్రూ భాషలో ఆమ్ యిరాయెల్ చాయ్ అని ముగించగానే.. పార్లమెంటులోని సభ్యులందరూ లేచి నిలబడి చప్పట్లతో గౌరవించారు. కొద్దిసేపటి వరకు హాల్ మొత్తం మోదీ.. మోదీ.. నినాదాలతో ప్రతిధ్వనించడం భారత దౌత్య విజయానికి పరాకాష్టగా నిలిచింది.
