“నేపాల్ సురక్షితమే.. టూరిస్టులు రావాల్సిందే”: మంత్రి విజ్ఞప్తి
ఊహించని విధంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో నేపాల్ పై భారీ ప్రళయం విరుచుకుపడింది. వరదల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మంది ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అయితే దాదాపు 300 మంది భారతీయులు గల్లంతైనట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చామని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు.

” కొద్ది నిముషాల్లోనే పట్టణాలకు పట్టణాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఒక్క రసువా జిల్లాలోనే 160 మంది మృతి చెందారు, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయింద”ని మంత్రి ఖనాల్ ధృవీకరించారు. గల్లంతైన వేలాది మంది విదేశీ టూరిస్టుల కోసం ఆ యా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
“వేలాది కుటుంబాలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ ఘోర విపత్తు నష్టం భారీగా ఉండవచ్చని భావిస్తున్నాం. ఊహించని విధంగా కాటేసిన భీకర ప్రళయంలో మానససరోవర్ యాత్రికులతో కలిపితే కనీసం 300 మంది భారతీయ పౌరులు గల్లంతయ్యారని మంత్రి తెలిపారు.
“యాత్రికులు ప్రభావిత ప్రాంతం గుండానే మానససరోవర యాత్రకు వెళ్లారు. సుమారు 300 మంది భారతీయులు గల్లంతైనట్లు సమాచారం అందింది. గల్లంతైన వారితో సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని ఖనాల్ అన్నారు.
ప్రస్తుతం దాదాపు 500 మంది విదేశీ పౌరులు సంప్రదింపులకు అందుబాటులో లేరని గల్లంతైన విదేశీ పౌరుల భద్రత విషయంలో నేపాల్ ప్రభుత్వం ఇతర దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. హిమాలయ దేశాన్ని ఇటీవలి కాలంలో తాకిన ఘోర విపత్తులలో రసువా ఆకస్మిక వరదలు ఒకటని అభివర్ణించారు. ప్రధాని మోదీ అందిస్తున్న తక్షణ సహాయక చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు ఖనాల్.
“ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది నేపాల్కు మద్దతుగా నిలుస్తున్నారు, సానుభూతి తెలుపుతున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే సహాయాన్ని అందించింది. వారికి మా కృతజ్ఞతలు” అన్నారు.
ప్రపంచ టూరిస్టులు నేపాల్ కు రావాలి: మంత్రి
ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ పర్యాటకులు నేపాల్ సందర్శనను కొనసాగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నేపాల్లోని చాలా పర్యాటక ప్రాంతాలు వరదల బారిన పడలేదని, పర్యాటకుల కోసం తెరిచే ఉన్నాయని తెలిపారు.
“తక్షణ సహాయం కంటే ముఖ్యంగా, ప్రపంచం నేపాల్తో అనుసంధానమై ఉంటూ మా పునర్నిర్మాణానికి సహాయపడటం ముఖ్యం. మా పునర్నిర్మాణ ప్రయత్నాలలో పర్యాటకం చాలా కీలకం. నేపాల్లో ఎక్కువ భాగం ప్రభావితం కాలేదు. పొఖారా, మౌంట్ ఎవరెస్ట్ పర్యాటకుల కోసం తెరిచే ఉన్నాయి. అవి సురక్షితంగా ఉన్నాయి. రాబోయే కొన్ని నెలల్లో మా పునర్నిర్మాణానికి సహాయపడేలా మీ పర్యాటక ఖర్చులను నేపాల్లో వెచ్చించాలి” అని ఖనాల్ అభ్యర్థించారు. “గతంలో ప్రకృతి విపత్తుల నుంచి బలంగా బయటపడ్డాం. ఈసారి కూడా నేపాల్ మళ్లీ తనను తాను పునర్నిర్మించుకుంటుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు.