Viral: తెల్లారి గుడికి వచ్చిన అర్చకులు.. ఆలయం బయట నీళ్లు చల్లుతుండగా కనిపించింది చూసి..
చిక్కమగళూరు జిల్లా కళసలో ఉగాది రోజున కలకలం రేగింది. స్థానిక కాలభైరవ ఆలయం ముందు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ క్షుద్రపూజలు నిర్వహించడం భక్తులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉగాది రోజున భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. కళస తాలూకా కంచినకెరె గ్రామంలోని ప్రసిద్ధ కాలభైరవ ఆలయం ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం స్థానికులను షాక్కు గురిచేసింది. ఉగాది పర్వదినాన తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న అర్చకులు, గుడి ముందు జరిగిన క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి షాక్ అయ్యారు. ఆలయం ముందు నాలుగు రాళ్లను ఉంచి, వాటికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, నాణేలతో పూజలు నిర్వహించినట్లు గుర్తించారు. నిన్న అమావాస్య కావడంతో, అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల మధ్య ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలో గతంలోనూ నదీ తీరంలో ఇలాంటి క్షుద్రపూజలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఏకంగా వేలాది మంది భక్తులు ఆరాధించే కాలభైరవ ఆలయం ముందే ఈ పనులు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే ఆలయంలో దొంగతనం కూడా జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న కళస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ చర్యకు పాల్పడింది స్థానికులా లేక బయటి వ్యక్తులా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో భద్రతను పెంచాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను స్థానికులు కోరారు.
