
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి పనిలో వారు బిజీగా ఉంటున్నారు. రోడ్డుపై ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకుండా వెళ్లేవారే ఎక్కువ. కానీ, అస్సాం రాజధాని గువహటిలో ఒక రాపిడో డ్రైవర్ మాత్రం తన వృత్తి కంటే మానవత్వం గొప్పదని నిరూపించారు. ఒక అంధ విద్యార్థికి ఆయన చేసిన సహాయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారి అందరి హృదయాలను గెలుచుకుంటోంది. గువహటిలో ఒక అంధ విద్యార్థి తన కాలేజీకి వెళ్లడం కోసం రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. రైడ్ స్వీకరించిన డ్రైవర్, ఆ విద్యార్థిని జాగ్రత్తగా తన బైక్పై కూర్చోబెట్టుకుని కాలేజీ వద్దకు తీసుకెళ్లారు. అయితే, కాలేజీ గేటు వద్ద వదిలేసి వెళ్ళిపోకుండా, ఆ విద్యార్థి ఇబ్బంది పడకూడదని భావించిన డ్రైవర్, తన బైక్ను పక్కన ఆపి అతన్ని చేత్తో పట్టుకుని నడిపిస్తూ కాలేజీ లోపలికి తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా, ఆ విద్యార్థి వెళ్లాల్సిన తరగతి గది (Classroom) వరకు తీసుకెళ్లి సురక్షితంగా వదిలిపెట్టారు.
ఈ హృద్యమైన దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్ చేసిన పనికి ముగ్ధులవుతున్నారు. డబ్బు కోసం కాకుండా బాధ్యతగా పని చేసే ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
మనుషుల్లో దేవుడు ఉంటాడని ఈ డ్రైవర్ను చూస్తే అర్థమవుతోంది అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇది చిన్న సహాయమే అయినా, అది ఎదుటివారికి ఇచ్చే భరోసా చాలా పెద్దది. ఆ రాపిడో డ్రైవర్ చేసిన ఈ పని తోటి డ్రైవర్లకు, సాధారణ పౌరులకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది. రాపిడో సంస్థ కూడా సదరు డ్రైవర్ను గుర్తించి అభినందించాలని నెటిజన్లు కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…