Viral News: మందుబాబులకు కిక్కు దిగే న్యూస్.. తాగితే మీ బండి నడవదు !!
మందుబాబులకు అతి పెద్ద సమస్య గా మారింది డ్రంక్ అండ్ డడ్రైవ్ . తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.
Viral News: మందుబాబులకు అతి పెద్ద సమస్య గా మారింది డ్రంక్ అండ్ డడ్రైవ్ . తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మొన్నామధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కావడంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తూ మందుబాబులు అడ్డుకుంటున్నారు. అయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వాహనం స్టార్ట్ అవకుండా చేసే ప్రత్యేక పరికరానికి ఝార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన ముగ్గురు ఇంజినీర్లు రూపకల్పన చేశారు. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్లో పనిచేస్తున్న అజిత్ యాదవ్కు ఈ ఆలోచన తట్టింది. బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు.. తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురవడాన్ని చూసి ఆయన ఈ పరికరాన్ని తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే తన స్నేహితులైన మనీశ్, సిద్ధార్థ్లతో కలిసి కార్యాచరణ ప్రారంభించారు.
వాహనాల్లో మద్యాన్ని పసిగట్టే భద్రతా వ్యవస్థను రూపొందించారు. ‘‘ఆల్కహాల్ సెన్సర్ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. డ్రైవర్ ఆల్కహాల్ సేవించాడో? లేదో? అనే విషయాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. డ్రైవర్ శ్వాసను విశ్లేషించి సెన్సర్కు ఆ సమాచారాన్ని పంపుతుంది. ఆల్కహాల్ ఆనవాళ్లు ఉంటే డిస్ప్లేలో ఆ వివరాలు ప్రత్యక్షం అవుతాయి. ఆ తర్వాత బజర్ మోగుతుంది. ఆ సిగ్నల్ ఇంధన పంప్కు చేరగానే సరఫరా నిలిచిపోతుంది. ఆల్కహాల్ సేవించినట్లు తేలితే.. వాహనం స్టార్ట్ అవకుండా అడ్డుకుంటుంది’’ అని అజిత్ యాదవ్ తెలిపారు. ఈ పరికరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.