Viral: మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది…

వజ్రాల కోసం పదేళ్లుగా వెతుకుతున్న మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీని ఎట్టకేలకు లక్ కలిసొచ్చింది. ఇటీవల అతడికి ఏకంగా రూ.80 లక్షల విలువైన 19.22 కారెట్ల వజ్రం దొరికింది. వివరాలు తెలుసుకుందాం పదండి...

Viral: మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది...
Raju Gound
Follow us

|

Updated on: Aug 02, 2024 | 10:59 AM

వజ్రాల కోసం పదేళ్లుగా వెతుకుతున్న ఓ దినసరి కూలీకి ఎట్టకేలకు అదృష్టం వరించింది. రోజుకు రూ.300కు పనిచేసే అతడికి ఏకంగా రూ.80 లక్షల విలువైన వజ్రం లభించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రాజు గోండ్ రోజు కూలీగా రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లో పన్నా గనులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఇక్కడ తరచూ వజ్రాలు దొరుతుంటాయి. అక్కడ ఓపిగ్గా వెతికితే వజ్రాలు లభిస్తాయని రాజు గోండ్, అతడి సోదరుడు రాకేశ్‌ విశ్వాసం. దీంతో, రాజు అప్పుడప్పుడూ ప్రభుత్వానికి రోజుకు రూ.800లు చెల్లించి అక్కడ వజ్రాల కోసం వెతుకుతుంటాడు. వజ్రం కోసం పదేళ్లుగా అతడు పడుతున్న ప్రయాస ఎట్టకేలకు ఫలించింది.

ఇటీవల అతడికి ఏకంగా రూ.80 లక్షల విలువైన 19.22 కారెట్ల వజ్రం లభించింది. దీనిపై రాజు స్పందిస్తూ.. ‘‘అది అద్భుతంగా మెరిసింది. చూడగానే అది వజ్రమన్న విషయం నాకు అర్థమైంది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. వజ్రం దొరకగానే ఆ సోదరులు ఆలస్యం చేయకుండా పన్నా డైమండ్ కార్యాలయానికి వెళ్లి చూపించారు. అక్కడి అధికారులు రాయిని పరిశీలించి నిజమైన వజ్రంగా ధ్రువీకరించారు. ప్రభుత్వ స్థలాల్లో వజ్రాల కోసం వెతికేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని రాజు గోండ్ పేర్కొన్నాడు. అందుకు ఐడీ ప్రూఫ్, ఫొటోలు, రూ.800 ఫీజు ప్రభుత్వానికి కట్టాలి. ఒక ప్రాంతంలో వెతకడం ముగిశాక మరో ప్రాంతంలో గాలింపు చేసేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి అని వివరించాడు. వజ్రం లభించడంతో తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని సంబరపడిపోయాడు. రాజు అదృష్టాన్ని చూసి స్థానికులూ ఆశ్చర్యపోయారు. వజ్రం అమ్మితే వచ్చే డబ్బుతో తన కుటుంబం అవసరాలు, పిల్లల చదువులపై ఖర్చు చేస్తానని రాజు తెలిపాడు. ముందుగా తనకున్న రూ.5 లక్షల అప్పును తక్షణం వదిలించుకుంటానని అన్నాడు. మిగిలిన సొమ్ముతో ఓ ఇల్లు కట్టుకుని, చిన్న పొలం కూడా కొనుక్కుంటానని వివరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..