AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

200 ఏళ్ల నాటి సైకిల్ కథ.. భారత్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో తెలుసా..?

ఈ రోజుల్లో సైకిల్ తొక్కడం అనేది ఒక వ్యాయామంగా మారిపోయింది కానీ, గతంలో అదొక పెద్ద సామాజిక హోదా. మరి ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న సైకిల్ అసలు ఎక్కడ పుట్టింది? పెడల్స్ లేని కాలం నుండి నేటి ఆధునిక డిజైన్ల వరకు సైకిల్ ప్రస్థానంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం..

200 ఏళ్ల నాటి సైకిల్ కథ.. భారత్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో తెలుసా..?
How Cycles Came To IndiaImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Jun 06, 2026 | 8:31 AM

Share

టెక్నాలజీ ఎంత మారినా, మార్కెట్ లోకి ఎన్ని రకాల లగ్జరీ కార్లు, బైకులు వచ్చినా.. సైకిల్ ఇచ్చే మజానే వేరు. మనలో ప్రతి ఒక్కరికీ చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్న రోజులు, మోకాళ్లు పగిలిన జ్ఞాపకాలు కచ్చితంగా ఉండే ఉంటాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోజువారీ స్వల్ప దూర ప్రయాణాలకే కాకుండా ఫిట్‌నెస్ కోసం కూడా సైకిల్ తొక్కడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. మరి ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ టూ వీలర్ అసలు ప్రపంచంలోకి ఎలా వచ్చింది? దేశంలో దీని ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? లాంటి ఎన్నో ఆసక్తికరమైన పాత ముచ్చట్లను ఇప్పుడు చూద్దాం.

1817లో తొలి అడుగు.. పెడల్స్ లేని రన్నింగ్ మెషిన్..

సైకిల్ చరిత్ర ఈనాటిది కాదు.. దాదాపు రెండు శతాబ్దాల క్రితం, అంటే 1817వ సంవత్సరంలో జర్మన్ ఆవిష్కర్త బారన్ కార్ల్ వాన్ డ్రైస్ మొదటి సైకిల్‌ను రూపొందించారు. విశేషం ఏమిటంటే.. అది పూర్తిగా చెక్కతో చేసిన వాహనం. దానికి డ్రైసియన్ లేదా రన్నింగ్ మెషిన్ అని పిలిచేవారు. ఇప్పటిలా దానికి పెడల్స్ కానీ, చైన్ కానీ ఉండేవి కావు. కేవలం కాళ్లతో నేలను వెనక్కి నెడుతూ ఆ బండిని ముందుకు నడిపించేవారు. ఆ తర్వాత 1860లలో ఫ్రెంచ్ కళాకారులు దీనికి పెడల్స్ జోడించగా.. బ్రిటన్‌లో దీనిని మరింత ఆధునికీకరించి నేటి అద్భుతమైన డిజైన్‌ను తీసుకువచ్చారు.

భారతదేశంలోకి ఎంట్రీ ఎప్పుడు?

మన దేశంలో సైకిల్ ప్రస్థానం బ్రిటిష్ పాలనలోనే మొదలైంది. 1890 నుండి 1910 మధ్యకాలంలో విదేశాల నుండి సైకిళ్లను తొలిసారిగా మన దేశానికి దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో రోడ్లపై సైకిల్ వెళ్తుంటే జనాలు వింతగా, ఎంతో ఆశ్చర్యంతో గుంపులు గుంపులుగా చూసేవారు.

ఒకప్పుడు ధనవంతుల వాహనం.. రూ.10లకే సొంతం.. ప్రారంభంలో సైకిళ్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో కేవలం బ్రిటిష్ అధికారులు, దేశంలోని జమీందారులు, ధనవంతులకు మాత్రమే ఇది పరిమితమై ఉండేది. అయితే 1930వ దశకంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో ప్రత్యేకంగా సైకిల్ దుకాణాలు వెలిశాయి. కాలక్రమేణా అది దేశంలోనే పెద్ద సైకిల్ మార్కెట్‌గా మారింది. 1950 – 60వ దశకాలలో కేవలం 10 రూపాయలకే సైకిల్ లభించేది. అప్పట్లో కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు వాయిదాల పద్ధతి కూడా ఇచ్చేవారు.

పెళ్లిళ్లలో రాజసం.. కట్నంగా సైకిళ్లు..

1940ల తర్వాత భారతదేశంలోనే స్థానికంగా సైకిళ్ల తయారీ ఊపందుకుంది. అట్లాస్, హీరో వంటి స్వదేశీ కంపెనీలు రంగంలోకి దిగడంతో సైకిల్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. 1942 తర్వాత దేశంలో రోజువారీ రవాణాకు ఇది ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. 1950వ దశకంలో సైకిల్‌కు సమాజంలో ఎంతటి క్రేజ్ ఉండేదంటే.. పెళ్లిళ్లలో అత్తగారింటి నుండి కట్నంగా సైకిల్ ఇవ్వడాన్ని ఒక గొప్ప సంప్రదాయంగా, రాజసంగా భావించేవారు.

కేవలం ఒక రవాణా సాధనంగా మొదలైన సైకిల్ ప్రస్థానం.. నేడు పర్యావరణాన్ని కాపాడే గ్రీన్ వెహికల్‌గా, ఆరోగ్యాన్ని ఇచ్చే బెస్ట్ ఫిట్‌నెస్ గైడ్‌గా నిలిచింది. పెట్రోల్ భారం లేకపోవడం, మెయింటెనెన్స్ ఖర్చు సున్నా కావడంతో నేటికీ ఇది ఎవర్ గ్రీన్ వాహనంగా సామాన్యుడి గుండెల్లో నిలిచిపోయింది.

Follow Us