
బామ్మ పుట్టిన రోజు సందర్బంగా మాకోడ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అవును..ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడ గ్రామానికి చెందిన నిమ్మల మల్లమ్మ ఇటీవల వందేళ్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం నాడు గ్రామంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బామ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఊరంతా తరలిరావడంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
మల్లమ్మకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారులలో ఒకరైన నారాయణ్ రెడ్డి చనిపోగా, మిగిలిన ఇద్దరు కుమారులు రాజారెడ్డి, విలాస్ రెడ్డి, కుమార్తెలు కమల, గంగుబాయి, చిట్టి తమ తల్లి పుట్టినరోజును చిరస్మరణీయంగా మార్చారు. ఈ వేడుకలో మల్లమ్మ పిల్లలు, వారి పిల్లలు (మనుమలు), మనుమరాళ్లు, మునిమనుమలు ఇలా మొత్తం నాలుగు తరాలకు చెందిన వారంతా ఒక్కచోటికి చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆదర్శవంతమైన జీవనం:
వేద మంత్రాల సాక్షిగా పండితులు దీవించే శతమానం భవతి అనే దీవెన మల్లమ్మ విషయంలో అక్షరాలా నిజమైంది. వయసు పైబడినప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ, తన కుటుంబ సభ్యులందరి మధ్య ఇలా వేడుక జరుపుకోవడం ఆమె అదృష్టమని గ్రామస్తులు కొనియాడారు. ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి, బామ్మను ఆశీర్వదించిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. వందేళ్ల వయసులోనూ చెదరని చిరునవ్వుతో కనిపిస్తున్న మల్లమ్మ, ఆరోగ్యకరమైన జీవనానికి ఒక నిదర్శనంగా నిలుస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.