
క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. వైద్య పరీక్షల్లో ఆమె మెదడులో వివిధ గడ్డలు బయటపడ్డాయి. ఇవి పరాన్నజీవి సంక్రమణ వల్ల సంభవించి ఉండవచ్చని వైద్యులు భావించారు.
నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో CT స్కాన్, MRI స్కాన్ చేయించగా, యువతి మెదడులో 20 నుండి 25 నోడ్యూల్స్ ఉన్నట్లు తేలింది. ఇది పరాన్నజీవి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని వైద్యులు భావించారు. ఫాస్ట్ ఫుడ్లో ఉపయోగించే క్యాబేజీ ద్వారా ఇన్ఫెక్షన్ సంక్రమించి ఉంటుందని అనుమానించారు. ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో ఆమెను RML ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు మెదడు ఆపరేషన్ జరిగింది. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.
క్యాబేజీ తినడం వల్ల పురుగులు మెదడులోకి ప్రవేశిస్తాయని, దీనివల్ల పిచ్చితనం, స్ట్రోక్, చివరకు మరణం కూడా సంభవిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది నిజమేనా? క్యాబేజీని పొలంలో పెంచినప్పుడు, మట్టి, తేమ కారణంగా పురుగులకు సులభంగా సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుందని డాక్టర్ వివరించారు. దీని ఆకులు పొరలుగా ఉంటాయి, చిన్న పురుగులు, వాటి గుడ్లు లోపల దాక్కుంటాయి. అయితే, క్యాబేజీని నేరుగా తినడం వల్ల పురుగులు మెదడులోకి ప్రవేశిస్తాయని దీని అర్థం కాదు. మెదడు పురుగు ని వైద్యపరంగా న్యూరోసిస్టిసెర్కోసిస్ అని పిలుస్తారు అని డాక్టర్ వివరించారు. ఈ వ్యాధి టెనియా సోలియం అనే టేప్వార్మ్ గుడ్ల వల్ల వస్తుంది. దీని అర్థం మెదడులో పురుగు నిరంతరం తిరుగుతుందని కాదు. వాస్తవానికి, ఈ పురుగు గుడ్లు మట్టిలో, మురికి కూరగాయలలో, సరిగ్గా ఉడికించని మాంసంలో కనిపిస్తాయి.
డాక్టర్ ప్రకారం, ఒక వ్యక్తి మురికి కూరగాయలు లేదా సరిగ్గా ఉడికించని మాంసం తిన్నప్పుడు, ఈ పురుగుల గుడ్లు కడుపులోకి ప్రవేశిస్తాయి. మన జీర్ణవ్యవస్థ ఈ గుడ్లను పూర్తిగా విచ్ఛనం చేయలేదు. అలాంటి సందర్భాలలో ఈ గుడ్లు రక్తప్రవాహం ద్వారా మెదడు, కళ్ళు, కాలేయం, కండరాలు వంటి శరీరంలోని వివిధ భాగాలకు చేరుకుంటాయి. ఈ గుడ్లు మెదడుకు చేరుకున్నప్పుడు, శరీర రోగనిరోధక వ్యవస్థ వాటికి వ్యతిరేకంగా స్పందించి, మెదడులో వాపును కలిగిస్తుంది. దీంతో తీవ్రమైన తలనొప్పి, వాంతులు, తలతిరగడం, మూర్ఛలకు కారణమవుతుంది.
వీడియో ఇక్కడ చూడండి..
వైద్యుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో పిల్లలలో మూర్ఛలకు న్యూరోసిస్టిసెర్కోసిస్ ఒక ప్రధాన కారణం. పిల్లలే కాదు, పెద్దలు, వృద్ధులు కూడా దీని బారిన పడవచ్చు. అయితే, ఇక్కడో మంచి విషయం ఏంటంటే.. దాదాపు 98 శాతం కేసులను మందులతో నయం చేస్తారు. అయితే 2 శాతం కేసులకు మాత్రమే శస్త్రచికిత్స అవసరం. ఈ వ్యాధిని నివారించడానికి ఉత్తమ మార్గం పరిశుభ్రత, సరైన ఆహారం అని డాక్టర్ వివరిస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే కాకుండా, ఎల్లప్పుడూ సరిగ్గా ఉడికించని ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా, ఎప్పుడూ సరిగ్గా ఉడికించని మాంసాన్ని తినకూడదు. మాంసాన్ని బాగా కడిగి, తినడానికి ముందు బాగా ఉడికించాలి.
క్యాబేజీని మాత్రమే కాకుండా మురికిగా లేదా సరిగ్గా కడగని కూరగాయలు తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని డాక్టర్ స్పష్టం చేస్తున్నారు. క్యాబేజీలో చాలా పొరలు ఉంటాయి. కాబట్టి గుడ్లు లోపల దాక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు క్యాబేజీని పూర్తిగా తినడం మానేయాలని దీని అర్థం కాదు. క్యాబేజీని సరిగ్గా కడిగి ఉడికించి తినడం సురక్షితం.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..