వంటింట్లో ఫ్లోరింగ్ పనులు.. పారకు తగిలిన 400ఏళ్ల నాటి రహస్య నిధి.. వేలం పాటతో శ్రీమంతులైన జంట
అదృష్టం అనేది అందరికీ ఒకేలా ఉండదు..అలాగే, ఎప్పుడు ఎవరినీ అదృష్టం వరిస్తుందో ఎవరికీ తెలియదు. అదృష్టం బాగుంటే.. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. అది లేనివారు ఎంత కష్టపడినా కూడా నిత్యం అన్నానికి కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితులు చూస్తుంటారు. కానీ, ఇదో అరుదైన సంఘటన ఓ జంట తమ పాత వంటింటిని మరమ్మతులు చేస్తుండగా వారు ఊహించని నిధి దొరికింది. దాంతో ఒక్కరోజులో వారు శ్రీమంతులుగా మారిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లాండ్లోని వెస్ట్ డోర్సెట్లో నివసించే రాబర్ట్ ఫూక్స్, అతని భార్య బెట్టీ ఫూక్స్ 400 ఏళ్ల నాటి తమ ఫామ్హౌస్లోని వంటింటికి మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లోర్ని కాస్త తగ్గించడం ద్వారా పైకప్పును పెంచాలని చూశారు. కానీ, వారు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్ర సృష్టిస్తుందని వారికి కూడా తెలియదు. రాబర్ట్ కాంక్రీట్ ఫ్లోర్ని తీసివేసి లోతుగా తవ్వడం మొదలుపెట్టగానే, అతని పారకు ఏదో బలంగా తగిలింది. టార్చిలైట్లో కనిపించినది అందరినీ ఆశ్చర్యపరిచింది. భూమిలో పాతిపెట్టబడిన మట్టి కుండలో నిండుగా మెరుస్తూ పాత నాణేలు దర్శనమిచ్చాయి.
17వ శతాబ్దపు నాణేలు లభ్యం..
భూమిలో దొరికిన మట్టిన కుండలో సుమారు 100 కంటే ఎక్కువ బంగారు, వెండి నాణేలు ఉన్నాయి. ఈ నాణేలు 1642 నుండి 1644 వరకు ఇంగ్లాండ్ మొదటి అంతర్యుద్ధం జరిగిన సమయం నాటివిగా నిపుణులు నిర్ధారించారు. ఈ సేకరణను ఇప్పుడు పోర్టన్ కాయిన్ హోర్డ్ అని పిలుస్తున్నారు. ఇందులో కింగ్ జేమ్స్ I, కింగ్ చార్లెస్ I ల బంగారు నాణేలు, అలాగే క్వీన్స్ ఎలిజబెత్ I, ఫిలిప్, మేరీ పాలనల నుండి వెండి అర్ధ కిరీటాలు, షిల్లింగ్లు, ఆరు పెన్సులు ఉన్నాయి.
ఈ నిధిని భూమిలో ఎందుకు పాతిపెట్టారు?
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆ సమయంలో ఇంగ్లాండ్ అంతర్యుద్ధంలో ప్రజలు సర్వం కోల్పోయారు. సైనికులు ఆహారం, విలువైన వస్తువుల కోసం జనావాసాల వైపు మళ్లారు. ఈ క్రమంలోనే చాలా మంది కుటుంబాల ఆస్తిని జప్తు చేశారు. అందువల్ల ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి ఇలా భూమిలో భద్రంగా పాతిపెట్టారు. ఫాక్స్ కుటుంబం పూర్వీకులు కూడా భయంతో ఈ నాణేలను దాచిపెట్టారని భావిస్తున్నారు. కానీ, బహుశా యుద్ధం తరువాత లేదంటే వారంతా మరణించిన కారణంగా వారు ఈ నిధి తిరిగి రాలేకపోవచ్చునని భావించారు.

వంటగదిలో దొరికిన నిధి
నిజాయితీగా వ్యవహరించిన ఆ జంట తమకు దొరికిన నిధి సంగతి అధికారులకు నివేదించారు. సంబంధిత అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పూర్తిగా శుభ్రం చేసి నాణేలను బ్రిటిష్ మ్యూజియంకు పంపారు. అక్కడి నిపుణులు అన్ని నాణేలను ఒకే సమయంలో పాతిపెట్టారని, అపారమైన చారిత్రక విలువను కలిగి ఉన్నాయని నిర్ధారించారు.
వేలంలో అదృష్టం..
ఈ అరుదైన నాణేలను తరువాత వేలంలో విక్రయించారు. అన్నీ కలిపి దాదాపు $75,000 (సుమారు రూ. 6.5 మిలియన్లు) పలికాయి. కొన్ని నాణేలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ధరలకు అమ్ముడయ్యాయి. ఉదాహరణకు చార్లెస్ I 1636 బంగారు కిరీటం. ఇది ఒక్కటే దాదాపు రూ.5,00,000 పలికింది. వేలం నిర్వాహకుల ప్రకారం, మొత్తం విలువ వారి అంచనా కంటే దాదాపు రెట్టింపు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




