
అక్కడి నేలకు తీరని దాహం. మనుషులకు తీరని దాహం. పశువులకూ తీరని దాహమే. ఏళ్లతరబడి బీళ్లు పడి.. దాహంతో నోళ్లు తెరుచుకునే భూములుండే ప్రాంతం అది. సహజంగానే అలాంటి నేల నుంచి ప్రశ్న పుడుతుంది. పోరాట జ్వాల రగులుతుంది. రాజకీయ చైతన్యాన్నీ పుట్టిస్తుంది. ఆగమనానికైనా, పునరాగమనానికైనా కేరాఫ్గా మారుతుంది. అందుకేగా కేసీఆర్ గంటల పాటు ప్రెస్మీట్ పెట్టి ఎన్నెన్నో టాపిక్లను ప్రస్తావించినా… హైలైట్ అయింది మాత్రం ఒక్క ‘పాలమూరు’నే. ఆ ఒక్క జిల్లాను టచ్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ మొత్తాన్నీ రగిల్చినట్టే. పాలమూరు చుట్టూనే ఎందుకీ రాజకీయం అనే ప్రశ్నకు ఇదే సమాధానం. కుతుబ్షాహీల కాలంలో మొదలైన పాలమూరు కూలీల వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా గానీ.. వలస అనే పదం మాత్రం పాలమూరునే అంటిపెట్టుకుని ఉంటోంది. తెలంగాణ వచ్చినా సరే వలసలు ఆగలేదా అంటే.. ఆగలేదు. ఓ డేటా చెప్పుకుందాం. పాలమూరు జిల్లాలో గిరిజనులు అత్యధికంగా నివసించే కొన్ని ప్రాంతాలున్నాయ్. అందులో సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, దామరగిద్ద, నారాయణపేట, కోయిల్కొండ, గండీడ్, నవాబ్పేట, మద్దూరు ఉన్నాయి. ఇక్కడ అర ఎకరం, ఎకరం, అసైన్డ్, సీలింగ్ భూములపై ఆధారపడ్డ గిరిజనులున్నారు. ఎత్తిపోతల ద్వారా నీళ్లిచ్చే పరిస్థితి లేక వర్షాధార పంటలే పండించారు. వర్షాల్లేని నాడు కూలీలకు పోయేవారు. అలా వలసల జిల్లాగా మారింది. 2016 డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే...