
భర్త తనను కాపురానికి రానివ్వడం లేదని.. తరచూ దూషిస్తున్నాడని మనోవేదనకు గురైన ఒక వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానిరి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం అనే యువకుడికి ధరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన శిరీష(21) అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజులు ఇద్దరు భార్య భర్తలు బాగానే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా భర్త శివలింగం తన భార్యను సరిగ్గా వంట చేయడం లేదని వేధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇటీవల తక్కువ చదువుకుందని, వంట కూడా సరిగ్గా చేయట్లేదనే ఆరోపణలతో భార్య శిరీషను భర్త శివలింగం తన పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అంతటిలో ఆగకుండా ఆమెను కాపురానికి రానివ్వకుండా.. రోజు ఫోన్ చేసి ‘నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు’ అని దూషించడం చేస్తున్నట్టు బాధితురాలి బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.