
నిరుద్యోగులకు శుభవార్త. ఎంతో కాలంగా వేచి చూస్తున్న తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సోమవారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెప్పింది. కాకపోతే ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించిన ఆదేశాల్లో వెల్లడించింది. కొత్తగా అప్లై చేసే వాళ్ళే అప్లికేషన్ ఫీజు చెలించాలని స్పష్టం చేసింది. కాగా, తాజా నోటిఫికేషన్లో అభ్యర్థుల వయస్సును 44 నుంచి 46కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షల తేదీ విషయానికొస్తే.. మే లేదా జూన్లో ప్రిలిమినరీ పరీక్ష ఉండగా.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు మార్గదర్శకాలు విడుదల చేశారు. గ్రూప్-1 పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ను ఎడిట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ఈ ఆప్షన్ మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు సమయాన్ని కూడా పేర్కొన్నారు. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభమయ్యే నాలుగు గంటల ముందు వరకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో పేపర్ లీకేజీ నేపథ్యంలో ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించిన టీఎస్పీఎస్సీ తాజాగా మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..