AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సనత్‌నగర్ టిమ్స్‌లో సూపర్ ట్రీట్‌మెంట్.. ఈ స్పెషాలిటీలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో సనత్‌నగర్‌లో రూ.1,070 కోట్లతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ అందుబాటులోకి వచ్చింది. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తూనే, విదేశీ రోగులకు అందుబాటు ధరల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా సరికొత్త మోడల్‌ను తెరపైకి తెచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సనత్‌నగర్ టిమ్స్‌లో సూపర్ ట్రీట్‌మెంట్.. ఈ స్పెషాలిటీలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Tims Sanathnagar Opens With 1082 Beds
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 18, 2026 | 2:07 PM

Share

భాగ్యనగర వైద్యరంగంలో సరికొత్త శకం మొదలైంది. ఇప్పటికే అత్యాధునిక వైద్య చికిత్సలకు కేంద్రంగా మారుతున్న నగరంలో.. సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రి ఇక విదేశీ రోగులకు కూడా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. విదేశాల నుంచి చికిత్స కోసం వచ్చే వారికి ప్రత్యేక వసతులతో పాటు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేలా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం జరిగింది. టిమ్స్‌లో విదేశీ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సేవలు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో 582 పడకలను ఇందుకోసం సిద్ధం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చులతో పోలిస్తే.. అందుబాటు ధరల్లోనే చికిత్స అందించడం ఈ విధానంలో ప్రధాన లక్ష్యం. మరోవైపు రాష్ట్రంలోని పేదలకు వైద్య సేవలను ఉచితంగా అందించనున్నారు.

ఆసుపత్రి నిర్వహణకు కొత్త ఆదాయ మార్గం

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కొనసాగించడానికి భారీగా నిధులు అవసరం. అందుకే విదేశీ రోగులకు అందించే సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆసుపత్రి నిర్వహణకు ఉపయోగించనున్నారు. దీనికి అదనంగా నిమ్స్ విధానాన్ని అనుసరిస్తూ సుమారు 200 పడకలను చెల్లింపు వైద్యం కోరుకునే రోగుల కోసం కేటాయించే ప్రణాళిక ఉంది. అంటే ఒకవైపు పేదలకు ఉచిత వైద్యం.. మరోవైపు చెల్లింపు, విదేశీ రోగుల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నది టిమ్స్ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఒక్క ఆసుపత్రిలోనే ఎన్నో ప్రత్యేక చికిత్సలు

సనత్‌నగర్ టిమ్స్‌ను కేవలం సాధారణ వైద్య సేవలకు పరిమితం చేయకుండా.. సంక్లిష్టమైన వ్యాధులకు అత్యున్నత స్థాయి చికిత్స అందించే కేంద్రంగా తీర్చిదిద్దారు. మొత్తం 37 వైద్య విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గుండె, ఛాతీకి సంబంధించిన క్లిష్టమైన వ్యాధులకు చికిత్సతో పాటు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. గుండె, కాలేయం, మూత్రపిండాల వంటి అవయవ మార్పిడి చికిత్సల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధులపై చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను అభివృద్ధి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమయం వృథా కాకుండా 24 గంటల ట్రామా కేర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా వైద్యం అందించేలా వ్యవస్థను రూపొందించారు.

16 ఆపరేషన్ థియేటర్లు.. 300కు పైగా ICU బెడ్లు

అత్యంత క్లిష్టమైన రోగులకు చికిత్స అందించేందుకు టిమ్స్‌లో 300కు పైగా ఐసీయూ పడకలు ఉన్నాయి. శస్త్రచికిత్సల కోసం 16 అధునాతన ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. రోబోటిక్ సర్జరీ సామర్థ్యంతో పాటు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక వైద్య పరీక్షల సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, ఇన్ఫెక్షన్ నియంత్రణ సదుపాయాలతో కూడిన ఐసీయూలు, ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. రోగిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి తరలించే సమయంలో కూడా ఆలస్యం జరగకుండా ప్రత్యేక మార్గాలు, లిఫ్టులు ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. వైద్య నమూనాలను ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు త్వరగా చేరవేసేందుకు ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చారు.

22.6 ఎకరాల్లో భారీ వైద్య కేంద్రం

సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణానికి రూ.1,070 కోట్లను ఖర్చు చేశారు. 22.6 ఎకరాల విస్తీర్ణంలో మూడు బ్లాక్‌లుగా నిర్మించిన ఆసుపత్రిలో ఐదు అంతస్తులు ఉన్నాయి. మొత్తం 1,082 పడకల సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశారు.

రోజుకు 4 వేల మంది వరకు సేవలు

పెద్ద సంఖ్యలో రోగులు వచ్చినా ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక మేనేజ్‌మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 24 గంటల అంబులెన్స్ సేవలు, డయాగ్నస్టిక్స్, నర్స్ కాలింగ్ సిస్టమ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రోగులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండకుండా వైద్య సేవలు పొందేలా అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందించారు. మే నుంచే ఓపీ సేవలను ట్రయల్ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 300 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. ఆసుపత్రి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రోజుకు దాదాపు 4 వేల మంది వరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

విదేశీ రోగులకు ప్రత్యేక సదుపాయాలు, అత్యాధునిక శస్త్రచికిత్స సామర్థ్యం, అవయవ మార్పిడి సేవలు, భారీ ఐసీయూ సామర్థ్యం.. ఇలా ఒకే చోట అనేక రకాల ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సనత్‌నగర్ టిమ్స్ రాష్ట్ర వైద్య రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశముంది.

Follow Us