AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఆ ప్రచారంలో నిజం లేదు.. స్పష్టం చేసిన తెలంగాణ ఆర్టీసీ

త్వరలోనే తెలంగాణలోని బస్సు డిపోలు ప్రైవేటుపరం కానున్నాయని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను..

TGSRTC: ఆ ప్రచారంలో నిజం లేదు.. స్పష్టం చేసిన తెలంగాణ ఆర్టీసీ
TGRTC
Ashok Bheemanapalli
| Edited By: Narender Vaitla|

Updated on: Aug 14, 2024 | 7:59 PM

Share

త్వరలోనే తెలంగాణలోని బస్సు డిపోలు ప్రైవేటుపరం కానున్నాయని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

కేంద్రప్రభుత్వ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుపాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఇదే విధానంలో ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. ఒలెక్ట్రా కంపెనీతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ఒప్పందం చేసుకుని పుష్ఫక్‌ పేరుతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఈ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌, మియాపూర్‌-2 డిపోల నుంచి ఈ బస్సులను తిప్పుతున్నారు. కాగా ఈ బస్సుల మెయిన్‌టనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది.

2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 500 ఇంటర్‌ సిటీ బస్సులను టెండర్ ద్వారా జేబీఎం కంపెనీకి ఆర్డర్‌ ఇవ్వగా.. వీటిలో 48 ఈ-సూపర్‌ లగ్జరీ బస్సులు ప్రస్తుతం రాగా.. వాటిలో 35 కరీంనగర్‌-2 డిపోకు, 13 నిజామాబాద్‌-2 డిపోలకు ఆర్టీసీ కేటాయించింది. ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం అవసరమైన చార్జింగ్‌ స్టేషన్ల నిర్మాణం డిపోల్లో పూర్తి కావస్తుండటంతో.. వాటిని త్వరలోనే ప్రారంభించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.

అదే విధంగా ప్రజల రవాణా అవసరాలు, కాలుష్య నివారణను దృష్టిలో పెట్టుకుని 2023లో 550 ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్లను సంస్థ పిలిచింది. అందులో 500 సిటీ బస్సులు, హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులున్నాయి. అందులో ప్రస్తుతం సిటీలో 74 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తుండగా.. విజయవాడ మార్గంలో ఈ-గరుడ పేరుతో 10 బస్సులు తిరుగుతున్నాయి. దశలవారీగా ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను సంస్థ అందుబాటులోకి తెస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగంలో దేశవ్యాప్తంగా అవలంభిస్తోన్న ఈవీ పాలసీనే 2019 నుంచి టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన అంటే బస్సు తిరిగే కిలోమీటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..