
తెలంగాణ రాష్ట్ర జంతువుగా ఉన్న మచ్చల జింకలకు రక్షణ లేకుండా పోతోంది. వికారాబాద్ జిల్లాలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చిటల్ లేదా మచ్చల జింకలు తరచూ మృత్యువాత పడుతున్నాయి. గత వారం రోజుల్లోనే దామగుండం అడవిలో కనీసం ఆరు మచ్చల జింకలు ప్రాణాలు కోల్పోయాయి. అవన్నీ వీధి కుక్కల దాడులకు బలవుతున్నాయి. కుక్కల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అడవిలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆశ్రయం పొందిన జింకలలో కొన్ని అక్కడ కూడా వీధి కుక్కల వేటకు గురయ్యాయి. శనివారం ఆలయ గుండంలో జింక కళేబరం గుర్తించారు. అదే ప్రదేశంలో మరొక జింక ప్రాణాలు కాపడుకునేందుకు తిరుగుతూ కనిపించింది.
ఈ విషయంపై ఆలయానికి సమీపంలో ఆశ్రమం నడుపుతున్న సత్యాయనంద స్వామి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భక్తలు దేవుడిని దర్శించుకోవడానికి ఈ గుడికి వస్తుంటే.. పాపం జింకలు మాత్రం చనిపోవడానికి వస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జింకలు చనిపోతున్నాయని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే.. వాళ్లొచ్చి జింకల కళేబరాలను తీసుకెళ్తున్నారనే కానీ, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్వామి ఆరోపిస్తున్నారు. దామగుండం అడవిలో వీధికుక్కలు దాడిలో కేవలం మచ్చల జింకలు మాత్రమే కాదు.. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద షెడ్యూల్ I జాతికి చెందిన, IUCN రెడ్ డేటా బుక్లో హాని కలిగించేవిగా జాబితా చేయబడిన నాలుగు కొమ్ముల జింకలు కూడా హతమవుతున్నాయి.
దీని గురించి అటవీ శాఖ అధికారులను సంప్రదించినప్పుడు వీధి కుక్కలను నియంత్రించడం తమ పని పరిధిలోకి రాదని, వాటిని అదుపులో ఉంచాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదేనని చెబుతున్నారు. ప్రతిరోజూ జింకలను కుక్కలు వెంబడించడం చూస్తుంటాం. నేవీ రాడార్ ప్రాజెక్ట్ కోసం అటవీ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున తొలగించిన తర్వాత జింకల మరణాలు పెరిగాయని, ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్న కార్మికుల తాత్కాలిక కాలనీల చుట్టూ కుక్కల సంచారం బాగా పెరిగిందని, అయినా కూడా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు అంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర జంతువును రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి