Telangana: తెలంగాణపై ఉరుముతున్న వరుణుడు.. ఆ జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు దుమ్ములేపుతున్నాయ్. పలు రాష్ట్రాలకు రెడ్అలర్ట్.. మెజారిటీ రాష్ట్రాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం రాత్రి సమయంలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
బుధవారం రాత్రి సమయంలో తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురుస్తుంది. గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు.
తెలంగాణలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
గురువారం తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అటు గురువారంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందంది.
