నిరుద్యోగులకు సర్కార్ సాయం.. రూ.5లక్షల వరకు పొందే ఛాన్స్! ఇలా దరఖాస్తు చేసుకోండి..
నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల వరకు ప్రభుత్వం సాయం అందించనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు..

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణలో మరో పథకం అమలుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా రూ.6 వేల కోట్లు అందించబోతున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్ఠంగా రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్పొరేషన్ల సహాకారంతో ఈ పథకం అమలు చేస్తామన్నారు. మార్చి15న అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
యువ వికాసంకు అర్హులైన నిరుద్యోగులు ఆన్లైన్లో ఏప్రిల్ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్స్ వెరిఫికేషన్, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఎంపికైన లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను ఇస్తారు. లబ్ధిదారుల ఎంపికకు కావాల్సిన అర్హతలను ఉన్నత అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూర్చే విధంగా కసరత్తు జరుగుతుంది. ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ సర్కారే నిరుద్యోగులకు బ్యాంకు లింకేజీతో లోన్ ఇప్పిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.