PLGA Celebrations vs Police: డిసెంబర్ 02 నుండి 09వ తేదీ వరకు పీ.ఎల్.జీ.ఏ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది. హై అలర్ట్ కొనసాగుతుంది. ఏకంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డే రంగంలోకి దిగారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రహస్యంగా పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. బుధవారం ములుగు జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన మావోయిస్టులను తెలంగాణలో అడుగు పెట్టనివ్వకుండా కట్టడి చెయ్యాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
PLGA వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఒకవైపు మావోయిస్టులు పిలుపునిస్తుంటే.. మరోవైపు మావోలను పట్టుపెట్టేందుకు ఖాకీలు కతర్నాక్ వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఛత్తిస్గఢ్లో వరుస సంఘటనల నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణలో అడుగు పెట్టకుండా కట్టడి చేసేందుకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. అందులో భాగంగా బుధవారం ములుగు జిల్లాలో రహస్యంగా పర్యటించారు. పోలీస్ అధికారులు, నిఘా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మావోయిస్టు కదలికలపై డేగ కన్నేసి పసిగట్టడమే కాదు, మావోయిస్టులు తెలంగాణ పొలిమేరల్లోకి అడుగు పెట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మావోయిస్టులు పిఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని అప్రమత్తం చేశారు. నక్సల్స్ అలాంటి దుశ్చర్యలకు ప్లాన్ చేసినా పసిగట్టి సమర్థవంతంగా తిప్పికొట్టి, పోలీసుల శక్తియుక్తులను చాటాలని డీజీపీ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా జాకారంలోని పోలీసు కార్యాలయంలో ఆయుధ కర్మాగారం బ్యారెక్ ను దందర్శించారు. తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ప్రశంసించారు. అదే స్ఫూర్తి, దక్షత, ఏకాగ్రత, అంకితభావంతో పనిచేసి, నక్సల్స్ చర్యలను ప్రతిగటించాలని దిశా నిర్ధేశం చేశారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంపై ఫోకస్ పెట్టి సమర్థవంతంగా చేయాలని సూచించారు. మీడియాకు తెలియకుండా రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..