
తెలంగాణలో బుధవారం మెడికల్ షాప్లు మూతబడనున్నాయి. ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల సాంప్రదాయ మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, దీనిపై ఆధారపడిన కోట్ల మంది జీవనోపాధి ప్రమాదంలో పడిందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.దీంతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే మందులను సులభంగా పొందుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పని అంటున్నారు.
పెద్ద పెద్ద కార్పొరేట్ ఆన్లైన్ సంస్థలు మందులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తూ మార్కెట్ను శాసిస్తున్నాయని, దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న మెడికల్ షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్-19 సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా తెచ్చిన అత్యవసర నోటిఫికేషన్లను (GSR 220(E), GSR 817(E)) ఇప్పటికీ కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలంగాణ డ్రగ్గిస్ట్స్ అండ్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గుప్తా టీవీ9 తో తెలిపారు.
ఎమర్జెనీ అయితే ఇక్కడకు వెల్లండి..
అయితే, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్లు మూతబడినా అత్యవసర వైద్య సేవల కోసం ప్రధాన ఆసుపత్రుల్లోని మెడికల్ షాపులు , కొన్ని ఎమర్జెన్సీ ఫార్మసీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అసోసియేషన్లు తెలిపాయి. కాబట్టి ప్రజలు ఇవి గుర్తించుకొని అవసరమైతే ఈ ఫార్మసీలను సందర్శించాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.