Telangana municipal Election Results 2026 LIVE: టెన్షన్ టెన్షన్.. అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!
Telangana municipal Election Results 2026 LIVE Counting and Updates in Telugu: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

LIVE NEWS & UPDATES
-
త్రిముఖ పోరులో విజయం ఎవరిదో..?
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే పని చేశాయి. చాలా చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ముఖ్యనేతలు పలు చోట్ల ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు ప్రతి ఒక్క ఓటరుతో టచ్లోకి వెళ్లారు. ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనట్టు స్పష్టమవుతోంది.
-
ఎవరి ధీమా వారిదే..!
పెరిగిన పోలింగ్ శాతం తమకే కలిసొస్తుందని ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా తామే అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు తాము అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ కూడా భావిస్తున్నాయి. అయితే చాలా చోట్ల అన్ని పార్టీల అభ్యర్థులు, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ చేయడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. దీంతో ఓట్ల లెక్కింపుపై పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
-
-
తొలి ఫలితం అలంపూర్..!
అత్యథికంగా చౌటుప్పల్లో 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా 59.68 శాతం నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది. ఇక కార్పొరేషన్లలో నల్గొండలో అత్యధిక పోలింగ్ నమోదైంది. నిజామాబాద్లో అత్యల్పంగా పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఉదయం 11 గంటల లోపే ఫలితం వస్తుంది. అత్యల్పంగా అలంపూర్లో 7,104 ఓట్లు పడ్డాయి. అలంపూర్ ఫలితం మొదటగా మొదటి రౌండ్లోనే రానుంది. అక్కడ పది వార్డులు ఉండగా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు.
-
పెరిగిన పోలింగ్ శాతం..కౌంటింగ్పై ఆసక్తి
ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కూడా కౌంటింగ్పై ఆసక్తి పెరగింది. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 70.26 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.
-
విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు
విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.
-
-
మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు!
ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం CCTV కెమెరాల నిఘాలో ఉంటుంది.
-
మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు
ఓట్ల లెక్కింపు కోసం 20 వేల మంది సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరికి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు.
-
-
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
-
కరీంనగర్ ఫలితాలపై కొనసాగుతోన్న ఉత్కంఠ
— ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు
— మరో గంటలో ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
— SRR కాలేజీలో కరీంనగర్ కార్పొరేషన్ 66 డివిజన్స్ ఓట్ల లెక్కింపు
— కరీంనగర్ 66 డివిజన్స్ ఓట్ల లెక్కింపునకు 66 టేబుల్స్ ఏర్పాటు
— రెండు డివిజన్లకు ఒక పర్యవేక్షకుడు చొప్పున నియామకం
— ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లు లెక్కించనున్న సిబ్బంది
— మూడు నాలుగు రౌండ్లలో పూర్తికానున్న ఒక్కో డివిజన్ ఓట్ల లెక్కింపు
— మధ్యాహ్నం 12గంటల వరకు బ్యాలెట్స్ను కట్టలు కట్టనున్న సిబ్బంది
— సాయంత్రానికి తేలనున్న పూర్తి ఫలితాలు
— ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల ఫలితాలపై కొనసాగుతోన్న ఉత్కంఠ
-
ఇందూరు పీఠం ఎవరిది..?
— ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు
— 8 మున్సిపల్ కేంద్రాల్లో వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
— నిజామాబాద్ పాలిటెక్నికల్ కాలేజీలో కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
— ఒక్కో డివిజన్కు ఒక్కో టేబుల్.. మొత్తం 60 డివిజన్లకు 60 టేబుల్స్ ఏర్పాటు
— ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు చొప్పున లెక్కింపు
— ఒక్కో కట్టలో 25 ఓట్లు.. ఒకేసారి 40 కట్టలు లెక్కించనున్న సిబ్బంది
-
మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసంః బండి
కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. యావత్ దేశమంతా కరీంనగర్ ఫలితాలవైపు చూస్తోందన్నారు. బీజేపీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని ఆయన చెప్పారు.
-
పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిః డీజీపీ
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిజిపి పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం 12 వేల మంది పోలీసు బలగాలతో పాటు సాయుధ బలగాలు , క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహారా కాస్తాయి. అదనపు భద్రత కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచామని తెలిపారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తన కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తామని వివరించారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నామని, పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
-
ముందస్తు జాగ్రత్తలు..!
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఈ రకమైన గొడవలు తలెత్తడంతో పోలీసులు, ఈసీ అలర్ట్ అయ్యింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది.
-
తెలంగాణలో ఇవాళే బిగ్ డే
— కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది
— 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కౌంటింగ్ జరగనుంది
— ఆయా స్థానాల్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించారు
— మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు
— 136 కేంద్రాలలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు
— కౌంటింగ్ విధుల్లో 20 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు
— కౌంటింగ్లో పారదర్శకత కోసం CCTV ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు
— ఫస్ట్ రెండు గంటల్లో మొదటి ఫలితం రాబోతుంది
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 15,000 నుంచి 20,000 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ పైకి తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడుతారు. 25కు తక్కువగా మిగిలిన బ్యాలెట్లను ప్రత్యేకంగా కట్టి సంఖ్యతో లేబుల్ చేస్తారు. ప్రతి రౌండ్లో వెయ్యి బ్యాలెట్ల 25 చొప్పున 40 కట్టలు తీసుకుని ప్రతి టేబుల్కు పంపిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు.
కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సిసిటివీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు. ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1,000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనుండగా, అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా జరగనున్నాయి.
Watch LIVE:
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published On - Feb 13,2026 6:45 AM




