Telangana: చుక్కలెన్ని ఉన్నా.. చందమామ ఒక్కటే.. చంద్రబాబు సభపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కాబోతుందంటూ.. దానికి బుధవారం నాటి ఖమ్మం సభ ఉదాహరణ అంటూ ప్రచారం హోరెత్తడంతో దీనికి బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన శంఖారావంపై..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కాబోతుందంటూ.. దానికి బుధవారం నాటి ఖమ్మం సభ ఉదాహరణ అంటూ ప్రచారం హోరెత్తడంతో దీనికి బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన శంఖారావం సభపై నిజామాబాద్లో ఆమె స్పందించారు. చుక్కలెన్ని ఉన్నా చందమామ ఒక్కటేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీలు ఎన్నున్నా.. కేసీఆర్ ఒక్కరేనన్నారు. చంద్రబాబు మళ్లీ వచ్చి మాట్లాడుతున్నారని, పార్టీని పునర్మించాలని పిలుపునిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ కాదన్నారు కవిత. గతంలో ఇక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారన్నారు. ప్రస్తుతం కూడా అదే జరుగుతుందన్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.
నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన కవిత.. పలు అంశాలపై మాట్లాడారు. కేంద్రప్రభుత్వ వైఖరితో పాటు.. రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కూడా ఆమె టార్గెట్ చేశారు. ఖమ్మంలో కొంత బలం ఉండటంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుతో ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ సభ నిర్వహించింది. ఈ సభకు భారీగా జనం హాజరుకావడంతో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ ప్రభావం ఏమాత్రం ఉంటుందనే చర్చ మొదలైంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, హైదరాబాద్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాంది పలికిందని చెప్పుకొచ్చారు.




ఇలా ఉండగా.. చంద్రబాబు నాయుడు కామెంట్స్ పై బీఆర్ ఎస్ నాయకులు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత సైతం చంద్రబాబు నాయుడు ఖమ్మం సభపై స్పందించారు.