TSPSC Group 1 Mains 2023: ‘టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ తేదీల్లో మార్పులేదు.. షెడ్యూల్ ప్రకారంగానే పరీక్షలు’
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ప్రకారం నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి జనార్దన్రెడ్డి తెలిపారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో మంగళవారం కమిషన్ కార్యాలయంలో..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ప్రకారం నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి జనార్దన్రెడ్డి తెలిపారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో మంగళవారం కమిషన్ కార్యాలయంలో టీఎస్పీఎస్సీ సభ్యులతో కలిసి జనార్దన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో అనుమానాలకు తావులేకుండా ఇకపై నిర్వహించే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం జరగనున్నట్లు ఛైర్మన్ బి జనార్దన్రెడ్డి తెలపారు. ఆయన ఇంకా ఈ విధంగా మాట్లాడారు..
ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కమిషన్ కార్యాలయ ఉద్యోగి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా గుర్తించాం. అతను కూడా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాశాడు. 103 మార్కులు వచ్చినా మెయిన్స్కు అతను అర్హత సాధించలేదు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ కూడా లీక్ అయ్యిందంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో మెయిన్స్కు సన్నద్ధమవుతున్న 25 వేల మంది అభ్యర్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేశాం. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం. నా పిల్లలు కూడా టీఎస్పీఎస్సీ పరీక్షలు రాయలేదు. మా మేనల్లుడు రాస్తానంటే ఈ ఛైర్మన్ ఉద్యోగం వదిలేస్తానన్నాను. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 41 కేటగిరీల్లో టీఎస్పీఎస్సీ 23 వేల ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిల్లో ఏడు పరీక్షలు జరిగాయి. ఎనిమిదో పరీక్ష టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ జరగాల్సి ఉండగా హ్యాక్ వదంతులు రావడంతో ఆ పరీక్షను వాయిదా వేశామని’ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్రెడ్డి వెల్లడించారు.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
