21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం తీసుకురానుంది. ప్రత్యేక సమావేశాల అనంతరం తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్
Cm Revanth Reddy

Updated on: Jul 26, 2026 | 12:20 PM

ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉండగా, దానిని 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. అయితే జర్మనీ, గ్రేట్ బ్రిటన్ వంటి దేశాల్లో 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాతే శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ దేశాల్లో ఆ వయస్సులోనే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులకు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే సింగపూర్‌లో 21 సంవత్సరాలు నిండిన వారు ప్రధానమంత్రి పదవికి అర్హులవుతారని ఆయన గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఉభయ సభల్లో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే కనీస వయోపరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదిస్తామని వెల్లడించారు. అనంతరం ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిస్తామని సీఎం చెప్పారు. దేశాన్ని పాలించే అవకాశాన్ని యువతకు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో చూడండి

ఈ ప్రతిపాదనను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మార్గదర్శకత్వంలో ఈ అంశానికి సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందేలా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన అమల్లోకి రావాలంటే భారత రాజ్యాంగం, ప్రజాప్రతినిధుల చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించే తీర్మానం కేంద్రానికి సిఫారసు మాత్రమే. తుది నిర్ణయం పార్లమెంట్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us