మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరుస విచారణలతో ఉచ్చు బిగించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు, ఫార్ములా ఈ-కార్ రేసింగ్పై ఇప్పటికే కూపీ లాగుతున్న రేవంత్ అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. తమ కంటే ముందు పదేళ్లపాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ప్రజల ముందు ఉంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారు. రాజకీయ విమర్శలు కాకుండా విచారణలకే ఆయన మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, తప్పిదాలను ఎత్తి చూపుతూ విచారణలకు సై అంటున్నారు రేవంత్. ఇందులో భాగంగానే మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తెప్పించుకున్నారు. 13వ తేదీన అఖిలపక్షంతో మేడిగడ్డ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి కేసీఆర్ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. మేడిగడ్డ సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. కమిషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై దుమ్మెత్తి పోస్తోంది.
వ్యవసాయంపై శ్వేత పత్రం పెట్టి కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్. పదేండ్ల వైఫల్యాలను లెక్కలతో సహా వివరించి ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు యత్నిస్తున్నారాయన. కేసీఆర్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఘోరమైన అన్యాయం జరిగిందనేది రేవంత్ వాదన. కేసీఆర్ పాలనలోని నిర్ణయాలపై విచారణకు ఆదేశించే ముందు టెక్నికల్ ఆధారాలన్నీ సమకూర్చుకుంటున్నారు రేవంత్. రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్లపై రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. రామగుండం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఆయన రాజీనామా చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశానని ఇటీవలే చెప్పారు. మొత్తం వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. అతి త్వరలో సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంపై విచారణ జరుపుతామని సీఎం రేవంత్ మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్చాట్లో తెలిపారు. విచారణకు ఆదేశించే ముందే పూర్తి వివరాలను నివేదికల రూపంలో తెప్పించుకుంటున్నారాయన.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..