
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని ఎన్నికల అధికారులకు కేబినెట్ సూచించింది. దీంతో పాటు గోదావరి పుష్కరాలు, హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు అత్యంత అట్టాహాసంగా జరుగుతాయి. దీంతో ఈ సారి ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసేందుకు ఆమోదముద్ర వేశారు. దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖల సంయుక్తంగా డీటేయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 నాటికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I ప్రాజెక్ట్ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-IIAలోని నాలుగు కారిడార్లు, ఫేజ్-IIBలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.2,787 కోట్ల అంచనా వ్యయమయ్యే భూ సేకరణ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్కు TGIIC కి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారా హిల్స్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు కొత్తగా 9 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.