Telangana Budget 2022: ఆ ముగ్గురినీ అందుకే సస్పెండ్ చేశాం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు..

Telangana Budget 2022: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంలోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో బీజేపీకి చెందిన..

Telangana Budget 2022: ఆ ముగ్గురినీ అందుకే సస్పెండ్ చేశాం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు..
Harish Rao

Updated on: Mar 07, 2022 | 5:29 PM

Telangana Budget 2022: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంలోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై మంత్రి హరీష్ రావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు చిట్‌ చాట్‌లో పాల్గొన్నారు. వెల్ లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బిఎసి లోనే నిర్ణయించామని చెప్పారు. వెల్ లోకి వచ్చారు కనుకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్ లోకి రాలేదని, అందుకే వారిని సస్పెండ్ చేయలేదన్నారు.

కాగా, బీజేపీ నేతలను సస్పెండ్ చేయడంపై వస్తున్న విమర్శలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్య సభలో జరిగిన సంఘటనను ఉటంకించిన ఆయన.. తమ స్థానంలో నిలబడి అడిగితేనే 12 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఢిల్లీలో ఒక న్యాయం.. రాష్ట్రంలో ఇంకో న్యాయమా? అని అన్నారు. సస్పెండ్ చేయించుకోవాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ ఎమ్మెల్యేలు వెల్ లోకి వెళ్ళారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్ సమయంలో వెల్‌ లోకి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

నిధుల కోసం కేంద్రంతో ఫైట్ చేయాలి.. రిక్వెస్ట్ కూడా చేయాలి అని పేర్కొన్నారు. తమకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయనే ఆశాభావంతోనే బడ్జెట్‌లో వాటిని చూపామన్నారు. ఫైనాన్స్ కమీషన్ల సిఫారసులను కూడా పక్కకు నెట్టిన ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఈ సారి 30కి పైనే కొత్త స్కీమ్‌లు పెట్టామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.3 లక్షల స్కీమ్‌కి డబుల్ బెడ్‌ రూమ్ స్కీమ్‌కి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి 15 వందల మందికి దళిత బంధు కింద సాయం చేయడం జరుగుతుందని, ఈ ఏడాదికి 45 వేల మందికి ఇస్తామని వివరించారు మంత్రి హరీష్ రావు. వచ్చే బడ్జెట్ పూర్తయ్యే నాటికి 2 లక్షల మందికి దళిత బందు సాయం అందుతుందని చెప్పారు ఆర్థిక మంత్రి.

Also read:

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Telangana Budget 2022: ఈ నెల 15 వరకు బడ్జెట్ సమావేశాలు.. BAC సమావేశంలో నిర్ణయం

Akshay Kumar: బీ టౌన్‌కు ఆపద్భాంవుడిగా మారిన అక్కీ.. వరస సినిమాలతో ఖిలాడీ బిజిబిజీ