
తెలంగాణ దంగల్లో వెనకబడ్డామన్న వార్తల్ని కొట్టిపారేస్తూ.. పసందైన మేనిఫెస్టోతో జనం ముందుకు వచ్చేస్తున్నాం అంటోంది కమలం పార్టీ. ఇప్పటికే తెలంగాణను రౌండప్ చేసిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతల చేతుల మీదుగానే తాయిలాల చిట్టా కూడా విడుదల చేయాలన్నది బీజేపీ ప్లాన్. కానీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మించి బీజేపీ మేనిఫెస్టోలో ఏమేం ఉండబోతున్నాయి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేంత స్టఫ్ ఏముంటుంది అనే ఆసక్తి నెలకొంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.
ఆరు గ్యారంటీలు ప్లస్ ఆరు డిక్లరేషన్లు.. బిగ్ఫైట్కు రెడీ అంటోంది కాంగ్రెస్ పార్టీ. పాత పథకాలకు కొత్త కలర్లు అద్ది ఎట్రాక్టివ్ స్టయిల్తో దంగల్లో దూకేసింది బీఆర్ఎస్. తెలంగాణలో మరో అపోజిషన్ పార్టీ బీజేపీ మాత్రం మేనిఫెస్టో రాసుకోవడంలో కాస్త వెనకబడింది. ఇన్నాళ్లూ అభ్యర్థుల జాబితాల కసరత్తుతోనే సరిపోయింది. అసమ్మతుల్ని బుజ్జగించడం మీదే ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు మరో రెండువారాలు మాత్రమే గ్యాప్ ఉండడంతో ఇప్పుడు ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది బీజేపీ. ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో మ్యానిఫెస్టోను నవంబర్ 18న బీజేపీ విడుదల చేయనుంది. మోదీ గ్యారెంటీ పేరుతో మ్యానిఫెస్టోను బీజేపీ సిద్ధం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా దీనిని విడుదల చేస్తామని రాష్ట్ర నాయకులు తెలిపారు. రైతులు, సామాన్యులే లక్ష్యంగా ఈ మ్యానిఫెస్టో ఉంటుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
విద్య, వైద్యానికి మ్యానిఫెస్టోలో బీజేపీ అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అందరికి విద్య, అందరికీ ఉచిత వైద్యం అనే నినాదాన్ని ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టిగా వినిపించబోతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ వ్యక్తికి జీవిత బీమాతో పాటు ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇవ్వనుంది. అలాగే వరి మద్దతు ధర క్వింటాలుకు 3100 చేస్తామనే భరోసా కూడా రైతులకు ఇవ్వబోతోంది. పంటల బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తామనే హామీ కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో ఉందని సమాచారం.
తెలంగాణలో ప్రతీ వివాహిత మహిళకు ఏటా 12 వేల రూపాయలు, వ్యవసాయ కార్మికులకు ఏటా 20 వేల ఆర్థిక సాయం అందించనుంది. కుటుంబాలపై భారం తగ్గించేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామనే వాగ్దానం కూడా కమలనాథులు చేయబోతున్నారు. తక్కువ ధరకు ఔషధాలు అమ్మే జనఔషధి కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించే సూచనలున్నాయి. ఇక యువతను ఆకర్షించేందుకు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తామనే మాట కూడా ఇవ్వబోతోంది. అంతే కాదు ప్రతీ నెలా మొదటి వారంలోనే ఉద్యోగానికి ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ కూడా బీజేపీ మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం.
వృత్తి విద్యలో అత్యున్నత సంస్థలైన ఎయిమ్స్, ఐఐటీ వంటివి తెలంగాణలో ఏర్పాటు చేస్తామని మాట కూడా తెలంగాణ ఓటర్లకు బీజేపీ ఇస్తుందని సమాచారం. గూడు లేని నిరుపేదలకు ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇళ్లు, అలాగే చిరువ్యాపారులు, చేతివృత్తిదారులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామనే భరోసా కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో ఉంటుందని తెలుస్తోంది. మహిళా సంఘాలు, రైతులకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తామని భారతీయ జనతా పార్టీ పేర్కొంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి…