Telangana: దారి తప్పుతున్న వారిలో వీళ్లే అధికం.. వాటికి బా’నిషా’ అవుతున్న మైనర్లు..
చదువుకునే వయసులో దారి తప్పుతున్నారు మైనర్లు. మద్యం మత్తుకు బానిసై తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. అయితే ఇది ఒక్కరిద్దరితో పరిమితం కాదు. దాదాపు అన్ని మురికివాడలు, బస్తీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బస్తీకి చెందిన యువకులు వైన్ షాపులకు వెళ్తుండగా, సంపన్నుల కొడుకులు పబ్లకు వెళ్లి మత్తులో ఊగుతున్నారు. ఇలా పబ్స్, వైన్స్ షాపులకు వెళ్తూ గతి తప్పుతున్నారు మైనర్లు. ఆట, పాట తప్పితే ఇంకేమీ తెలియనటువంటి వయసులో మద్యానికి, గంజాయికి బానిసవుతున్నారు మైనర్లు. వీరిని చూస్తుంటే అటు పోలీసులు, ఇటు తల్లిదండ్రులు కలవర పడుతున్నారు.
![Telangana: దారి తప్పుతున్న వారిలో వీళ్లే అధికం.. వాటికి బా'నిషా' అవుతున్న మైనర్లు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/telangana-2.jpg?w=1280)
చదువుకునే వయసులో దారి తప్పుతున్నారు మైనర్లు. మద్యం మత్తుకు బానిసై తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. అయితే ఇది ఒక్కరిద్దరితో పరిమితం కాదు. దాదాపు అన్ని మురికివాడలు, బస్తీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బస్తీకి చెందిన యువకులు వైన్ షాపులకు వెళ్తుండగా, సంపన్నుల కొడుకులు పబ్లకు వెళ్లి మత్తులో ఊగుతున్నారు. ఇలా పబ్స్, వైన్స్ షాపులకు వెళ్తూ గతి తప్పుతున్నారు మైనర్లు. ఆట, పాట తప్పితే ఇంకేమీ తెలియనటువంటి వయసులో మద్యానికి, గంజాయికి బానిసవుతున్నారు మైనర్లు. వీరిని చూస్తుంటే అటు పోలీసులు, ఇటు తల్లిదండ్రులు కలవర పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి కోటి రూపాయలు విలువ చేసేటటువంటి బైకులను సీజ్ చేశారు. అయితే ఈ రేసింగ్లలో మైనర్లు సైతం ఎక్కువగా పాల్గొన్నట్లు చెప్తున్నారు. ఒకవైపు పబ్స్, మద్యం బానిసలుగా మారడమే కాకుండా రేసింగ్లలో పాల్గొని ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో మైనర్లు చదువును బంద్ చేసి ప్రేమ పేరుతో తల్లిదండ్రులను కాదనుకొని వెళ్లిపోయిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులో ఎక్కువగా 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉంటున్నారు. దీంతో వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇదంతా ఎక్కువగా బస్తీలోనే జరుగుతున్నట్లు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, వాటి గణాంకాలు చెబుతున్నాయి. చదువుకునే వయసులో ప్రేమ పేరుతో బయటికి వెళ్లి కష్టాలు పడడం ఆ తర్వాత పరిస్థితులను బట్టి కేసులు నమోదు చేయడం జరిగింది.
మరోవైపు బస్తీలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మద్యానికి బానిసై అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రి కాగానే మద్యం తాగి పోకిరీ చేష్టలకు పాల్పడుతున్నారు. బస్తీల్లో బెల్ట్ షాపులు అధికంగా ఉండటంతో చాటుమాటుగా వెళ్లి మద్యం తాగుతున్నట్లు సర్వేలో తెలిసింది. మైనర్లకు మద్యం సరఫరా చేసే వారిపై కేసులు పెట్టాలని స్వచ్ఛంద సంస్థలు పోలీసులు సైతం కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈ విధంగా ఉంటే ధనవంతులు బిడ్డలు వీకెండ్ రాగానే పబ్బులు, హుక్కా సెంటర్లు అంటూ దారి తప్పుతున్నారు. ఈ విధంగా హుక్కా సెంటర్ల పై దాడి చేసిన పోలీసులు.. కొంతమంది మైనర్లపై కేసులు కూడా నమోదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా సంపన్నుల కొడుకులు ఒకవైపు, అలా బస్తిలో ఉన్నటువంటి మైనర్లు మరోవైపు చిన్న వయసులోనే తప్పు దారి పట్టడంతో అటు తల్లిదండ్రులను ఇటు పోలీసులను సైతం భయాందోళన గురి చేస్తున్నాయి. వీటిపై ఎంత కౌన్సిలింగ్ చేసినా వారి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. దీనిపై కఠినమైన నిబంధనలు, చట్టాలు తీసుకొస్తే తప్ప తమ బిడ్డలు తల్లదండ్రుల చేతికి అందిరారు అని భావిస్తున్నారు. మరి ప్రభుత్వాలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..