విశాఖలో విషవాయువు లీక్ ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత అర్థరాత్రి సాగర తీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతా గాఢనిద్రలో ఉండగా విషవాయువు వ్యాపించి ప్రజల ఊపిరి తీసింది. దీంతో ఆ విష వాయువు పీల్చి జనం ఎక్కడికక్కడే పిల్లల్లా రాలిపడిపోయారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఎక్కడ చూసినా రోడ్లపై జనం, జంతువులతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా కనిపించింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందారు. దీంతో వెంటనే ఏపీ ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
కాగా ఇప్పుడు ఈ ఘటనతో హైదరాబాద్లో ఉన్న ప్రజలు సైతం భయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ 5 వేల నుంచి 6 వేల వరకూ వివిధ రకాల పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, బాచుపల్లి, నాచారం, చర్లపల్లి, కూకట్ పల్లి, బాలా నగర్, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, పటాన్ చెరు, సనత్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఫార్మా, రసాయన పరిశ్రమలు, ఉన్నాయి. విషవాయువులను వెదజల్లే వేల కొద్దీ పరిశ్రమలు భాగ్యనగరం చుట్టూ విస్తరించి ఉన్నాయి. ఆ పరిశ్రమల నుంచి వెలువడే టన్నుల కొద్దీ రసాయన వ్యర్థాలను ఆ పరిసరాల్లో, కాలువల్లో గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రుళ్లు వదులుతూంటారు నిర్వాహకులు. తాజాగా విశాఖ ఘటన నేపథ్యంలో ఇకనైనా కాలుష్య నియంత్రణ మండలి అప్రమత్తం కావాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
Read More:
బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించిన జగన్
లాక్డౌన్: ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే చాలట