చిన్న ప్రయత్నం.. ప్రయాణికుల మనసులు గెలుచుకుంటున్న ఆర్టీసీ.. ఏం చేశారో తెలుసా?
ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు బస్సుల్లో ప్రయాణికులను కండక్టర్లు పలకరించే ప్రత్యేక విధానం ప్రవేశపెట్టారు.

ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు బస్సుల్లో ప్రయాణికులను కండక్టర్లు పలకరించే ప్రత్యేక విధానం ప్రవేశపెట్టారు. కేవలం ఒక చిన్న మార్పు మాత్రమే అయినప్పటికీ.. ఇది ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మారేస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త ఒరవడి హైదరాబాద్ నగరం పరిధిలోని బండ్లగూడ డిపో నుంచి తొలుత శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరించింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతీ ట్రిప్ ప్రారంభంలోనే బస్సులోని కండక్టర్లు ప్రయాణికులను పలకరించి, ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. విమానాల్లో ప్రయాణం ప్రారంభానికి ముందు ఎయిర్ హోస్టెస్లు.. తమ పేర్లు, విమానం వివరాలు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు. ఈ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోనూ అమలు చేస్తున్నారు. బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, ప్రయాణించే మార్గాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కొత్త ప్రయాణికులు సైతంగా సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా సమాచారం అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ప్రయాణికులకు మరింత నమ్మకం, సానుకూల అభిప్రాయం పెరుగుతోంది. తద్వారా ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని పెంచడంపై ఆర్టీసీ దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే ‘ప్రయాణికులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు రాధిక. ఈ బస్సు కండక్టర్ను. డ్రైవర్ పేరు సాయికుమార్. మనం కరీంనగర్ నుంచి గోదావరిఖనికి ప్రయాణిస్తున్నాం. ప్రయాణికుల భద్రతకు అగ్నిమాపక పరికరాలను డ్రైవర్ క్యాబిన్ వద్ద అమర్చారు. మిమ్మల్ని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆర్టీసీ బాధ్యత. ఆర్టీసీలో ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. హ్యాపీజర్నీ’ అంటూ ఈ కండక్టర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని బస్సుల్లో మొదటి ట్రిప్పులో ఈ స్వాగత వచనాలు చెబుతున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఆర్టీసీ తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంపై ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఒక ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఇంత స్నేహపూర్వకంగా మారడం.. ప్రయాణికులకు విలువనివ్వడం చాలా సంతోషకరం అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ఆర్టీసీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్ల పలకరింపు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది ఆర్టీసీ ప్రతిష్టను మరింతగా పెంచడమే కాకుండా.. సంస్థ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని బలపరుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
