Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నిందితులపై కేసు నమోదు.. మధ్యాహ్నం ఆడియో, వీడియోల రిలీజ్
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆడియోలు, వీడియోలు చాలా కీలకం కానున్నాయి. వీటిని మధ్యాహ్నం బయటపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిందితులను రిమాండ్కు తరలించే అవకాశం ఉందంటున్నారు.
టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, రోహిత్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డిలకు ప్రలోభాలు చూసి ఎర వేశారన్న అభియోగాలు, ఆరోపణలపై అటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ అంటుంటే, కమలం పార్టీ కుట్ర అని టీఆర్ఎస్ నిరసలకు దిగుతున్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆడియోలు, వీడియోలు చాలా కీలకం కానున్నాయి. వీటిని మధ్యాహ్నం బయటపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిందితులను రిమాండ్కు తరలించే అవకాశం ఉందంటున్నారు. కాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫామ్హౌస్లో పట్టుబడిన రామచంద్ర భారతీ అలియాస్ సతీష్ శర్మ నివాసం, పరిచయం, నేపథ్యం తదితర వ్యవహారాలపై ఆరా తీయాలని ఢిల్లీ తెలంగాణ భవన్లోని ఇంటెలిజెన్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సైతం మధ్యాహ్నం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. అంతకుముందే నలుగురు ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వచ్చి అసలు నిజాలు చెప్పనున్నారని తెలుస్తోంది. కాగా ఫామ్హౌస్లో పట్టుబడిన వారిపై మొయిన్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం, బేరసారాలకు పాల్పడ్డారని నిందితులపై కేసు నమోదైంది. కాగా ముగ్గురు నిందితులను రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు. డీల్ వెనుక సూత్రధారులు ఎవరనే విషయాన్ని కూపీ లాగుతున్నారు. ఈనేపథ్యంలో ముగ్గురు నిందితుల మొబైల్స్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే మధ్యవర్తులను కూడా న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..