ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ పెద్దలను కుదిపేస్తుంది. ఇప్పటివరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతుంది. నేతలు చెబితేనే ప్రత్యర్ధుల ఫోన్లు టాప్ చేశామని ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు వాంగ్మూలం ఇస్తున్నారు. వీటితోపాటు ప్రత్యక్షంగా పలువురు నేతలు తమ ఫోన్లను టాప్ చేశారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు ఈ ట్యాపింగ్ భూతంలో చిక్కుకునేది ఎవరు? వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు నలుగురు పోలీస్ ఉన్నతాధికారులను అరెస్టు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. త్వరలోనే వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో రాజకీయ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే నేతల వివరాలను రాబట్టిన పోలీసులు అధికారిక నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు అరెస్ట్ అయిన అధికారుల రిమాండ్ రిపోర్ట్ బహిర్గతం కావడంతో తమ ఫోన్లు టాప్ అయ్యాయి అంటూ పలువురు నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు, రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ-4 నిందితుడిగా ఉన్నాడు మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వెల్లడించాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు అండ్ కో ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేసినట్టు రాధా కిషన్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే దుబ్బాక అప్పటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రాష్ట్ర డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను టాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ప్రణీత్ రావు అండ్ కో తన ఫోను టాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు.
అప్పట్లో ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు బేగంపేట్ వద్ద రఘునందన్ రావుకి సంబంధించిన కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. సిద్దిపేటకు సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారు రఘునందన్ రావు బంధువులు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి సంభాషణలు విన్న ప్రణీత్ రావ్ అండ్ కో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో రఘునందన్ రావుకు చెందిన కోటి రూపాయలు సీజ్ చేశారు. అయితే ఈ ఘటనపై తాజాగా హరీష్ రావుతో పాటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. తన ఫోన్లు టాప్ చేసిన రాజకీయ నాయకులపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాష్ట్ర డిజిపిని కలిసి విన్నవించుకున్నారు.
ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాజీ మంత్రి కేటీఆర్కు సైతం చుట్టుకుంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేశార. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటైన వార్ రూమ్ను కేటీఆర్ నడిపించారంటూ మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల సెంట్రిక్గానే మొత్తం ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.
ఇక ఈ ఫిర్యాదులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేతలకు ట్వీట్తో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను లీగల్గా ఎదుర్కొంటానని ట్వీట్ చేశారు. కె.కె. మహేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు, మంత్రికి లీగల్ నోటీసులు ఇస్తానని కేటీఆర్ చెప్పారు. నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాలని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను లీగల్ గా ఎదుర్కొంటా… కె.కె. మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి,మంత్రి కొండా సురేఖకి లీగల్ నోటీసులు ఇస్తా
నిరాధార ఆరోపణలు చేస్తున్న వాళ్ళు క్షమాపణ చెప్పాలి… https://t.co/cMXupuYvni pic.twitter.com/2uWhF5GD4q
— KTR News (@KTR_News) April 2, 2024
ఇక తాజాగా రాష్ట్ర డిజిపి ని కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత సమ్మిరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారని అందులో తనిఖీలు జరిపించాలని రాష్ట్ర డిజిపిని కలిసి వినతి పత్రం అందించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్లను టాప్ చేశారని ఆరోపిస్తూ డిజిపి రవి గుప్తాకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఇలా ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుండగానే నేతలు గత ప్రభుత్వ పెద్దలపై ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. వ్యాపారులు, ప్రతిపక్ష నాయకులు వారి కుటుంబ సభ్యులు, ఆఖరికి సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం గత ప్రభుత్వ పోలీస్ అధికారులు టాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీస్ అధికారుల పాత్ర పై క్లారిటీకి వచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల భరతం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నాయకులపై పలుచోట్ల ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు, మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు లు తమ ఫోన్లను టాప్ చేశారంటూ బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ అధికారుల పాత్రను లోతుగా దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం వారు ఇచ్చే సమాచారం ఆధారంగా రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…